బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఆయా పార్టీల ప్రతినిధులు, అన్ని నియోజకవర్గ ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ కార్యక్రమం గురించి వివరించారు. జిల్లావ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,640 పోలింగ్ కేంద్రాల్లో 16,50,811 మంది ఓటర్లు ఉన్నారన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ప్రతి ఇంటికీ ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేస్తారని తెలిపారు. ఇప్పటి వరకూ 9,96,656 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణి చేశామన్నారు. దీని ద్వారా 2002లోని ఓటర్ల జాబితాను ప్రస్తుత జాబితాతో మ్యాపింగ్ చేయడం పూరయ్యిందన్నారు. బీఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు ఓటర్లు తమ పాస్పోర్టు సైజు ఫొటోతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు అందుబాటులో పెట్టుకునేలా ఆయా పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 మంది ఓటర్లు ఉండేలా, జిల్లాలో కొత్తగా 183 కేంద్రాలను ప్రతిపాదించామని, వీటిపై సలహాలు సూచనలు అందించాలని కలెక్టర్ కోరారు.


