కాకినాడ క్రైం: ప్రపంచ సికిల్సెల్ అనీమియా నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన డీఎంహెచ్ఓ నరసింహ నాయక్, సిబ్బంది శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత డీఎంహెచ్ఓ కార్యాలయ ఆవరణలో అవగాహన ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. ఎర్రరక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారి రక్తనాళాల్లో అడ్డుగా ఏర్పడతాయని డాక్టర్ నాయక్ ఈ సందర్భంగా తెలిపారు. దీనివలన నొప్పి, రక్తహీనత, అవయవ నష్టం వాటిల్లుతాయని చెప్పారు. గిరిజనుల్లో ఈ సమస్య అధికంగా ఉంటోందన్నారు. సికిల్సెల్ అనీమియా జిల్లా నోడల్ అధికారి డాక్టర్ ఐ.ప్రభాకర్ మాట్లాడుతూ, జిల్లాలో ఏడాది కాలంలో 11,800 మందికి సికిల్సెల్ పరీక్షలు నిర్వహించగా, ఐదుగురిలో వ్యాధి నిర్ధారణ అయిందని చెప్పారు. 63 మందిని వ్యాధి వాహకులుగా గుర్తించామన్నారు. బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ర్యాలీలో డీఎల్ఏటీఓ డాక్టర్ చలమయ్య, డీఐఓ డాక్టర్ కేవీ సుబ్బరాజు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వి.అరుణ, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.


