సాగర తీరంలో బీచ్ షాక్స్ పేరిట మద్యం విక్రయాలకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కాకినాడకు చెందిన సామాజిక కార్యకర్త దూరస్లపూడి రమణరాజు నిరసించారు. కాకినాడ సూర్యారావుపేట న్యూ ఎన్టీఆర్ బీచ్లో ‘బీచ్ షాక్స్ వద్దు! సముద్ర తీరాల్లో యువత భవిష్యత్తు పాడు చేయవద్దు’ అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించి, గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2024–25లో 362 లక్షల కేసులు 2025–26లో 414 లక్షల కేసుల మేర మద్యం అమ్మకాలు జరిగాయన్నారు. మద్యం ఆదాయం రూ.44 వేల కోట్లు దాటిందని, సిండికేట్ అధిక ధరలకు మద్యం విక్రయిస్తోందని, సరిహద్దు నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగిపోయిందని చెప్పారు. మద్యం వలన 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు ఎక్కువ ప్రభావితమవుతున్నారని, బీచ్ రోడ్లు, జాతీయ రహదారుల్లో మద్యం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. కాకినాడ మీదుగా రూ.150 కోట్లు పైగా గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో బీచ్ షాక్స్ ఏర్పాటు వలన పరిస్థితి మరింత దిగజారుతుందని రమణరాజు ఆందోళన వ్యక్తం చేశారు.
– కాకినాడ రూరల్


