శంఖవరం: కత్తిపూడిలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం నుంచి తుని వైపు కంటైనర్ వెళ్తుండగా కత్తిపూడిలో వెనుక నుంచి వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ షేక్ సుభాని (50) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనిది కృష్ణా జిల్లా నూజివీడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు.
గ్యాస్ సిలిండర్ పేలి
ఇల్లు ధ్వంసం
శంఖవరం: గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇల్లు ధ్వంసం అయ్యింది. అక్కడ ఎవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో ప్రగడ కల్పన ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో ఇంటి గోడలు బీటలు వారాయి. పేలుడు ధాటికి వస్తువులు, దుస్తులు చెల్లాచెదురయ్యాయి. స్టౌపై అన్నం వండుతూ మిగతా పని చూసుకునేందుకు మేడ పైకి వెళ్లిన సమయంతో పెద్ద పేలుడు శబ్దం వచ్చి చూసేసరికి మంటలు వ్యాపించాయని బాధితురాలు తెలిపారు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు మంటలు అదుపు చేశారు. ఇండియన్ గ్యాస్ కంపెనీ నిర్వాహకులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.


