● లక్ష్మీకాంతంకు న్యాయం చేయండి
● దళిత, బహుజన మహిళా శక్తి
జాతీయ కన్వీనర్ రాజామణి
అనపర్తి: కని పెంచిన తల్లిని ఇంటి నుంచి గెంటేయడం చట్టరీత్యా నేరమని దళిత, బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్, న్యాయవాది కొంకి రాజామణి అన్నారు. గురువారం బిక్కవోలు పోలీస్ స్టేషన్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. పందలపాక గ్రామానికి చెందిన కొవ్వూరి లక్ష్మీకాంతానికి ముగ్గురు కుమారులు ఉన్నారన్నారు. వీరి తండ్రి చిన్నప్పుడే విడిచి వెళ్లిపోవడంతో లక్ష్మీకాంతం ఆ ముగ్గురి పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేశారన్నారు. అలాగే ఆమెకు ఉన్న పూర్వపు ఆస్తులు కూడా ఆ కుమారులకు ఇచ్చేశారన్నారు. ఇది లా ఉండగా మార్చి 5న జరిగిన ఓ సంఘ టనలో నమోదైన కేసు లో ముగ్గురు కుమా రులు నిందితులుగా ఉన్నారని, ఈ నేపథ్యంలో తల్లి లక్ష్మీకాంతం కుమారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పలేదన్న కోపంతో మార్చి 21న ముగ్గురు కుమారులు, కోడలు, లక్ష్మీకాంతం సోదరుడు, అతని భార్య కలసి లక్ష్మీకాంతం వద్ద ఉన్న నగదు, బంగారం లాక్కుని కొట్టి బయటకు గెంటేశారన్నారు. అప్పటి నుంచి దేవాలయాల వద్ద తలదాచుకుంటుందని, తన కుమారులు, సోదరులు కలసి తనను చంపాలని చూస్తున్నారని బాధితురాలు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారని రాజామణి తెలిపారు. అలాగే దళిత, బహుజన మహిళా శక్తి ఆధ్వర్యంలో గురువారం బాధితురాలితో కలసి బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఎస్సై రవిచంద్రకుమార్కు ఫిర్యాదు కాపీని ఇవ్వడానికి రాగా, ఆమె కుమారులను పిలిచి మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు.


