
నేడు పింఛన్ల పంపిణీ
కాకినాడ సిటీ: జిల్లాలో ఈ నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి అన్ని మండల, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ నేపథ్యంలో 2,73,065 మందికి రూ.118.27 కోట్లు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో అదనంగా మరో 4,763 మందికి స్పౌజ్ పింఛన్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ తెలిపారు.
అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ
జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం అమలుపై గురువారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి అన్ని మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 2వ తేదీన అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ కింద జిల్లాలో 1.48 లక్షల మంది రైతులకు రూ.98.8 కోట్లు అందించడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.7 వేలు అర్హులైన రైతులకు అందిస్తోందన్నారు. అర్హుడైన చివరి రైతు వరకు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం వర్తింప చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్ విజయకుమార్, ఇతర వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కడియం నర్సరీ అందాలు అద్భుతం
కడియం: నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఆయన కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని సందర్శించారు. ఆ నర్సరీ రైతు పుల్లా పెద సత్యనారాయణ మొక్కనిచ్చి స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ నర్సరీ రైతులకు ప్రభుత్వ ద్వారా తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ పాటిస్తూ నర్సరీలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. వైఎస్సార్ హెచ్ ఓ డైరెక్టర్ బి.గోవిందరాజు, కొవ్వూరు పరిశోధన క్షేత్రం ప్రిన్సిపాల్ డాక్టర్ పి.లలిత కుమారేశ్వరి, సీనియర్ సైంటిస్టులు డాక్టర్ రవీంద్ర కుమార్, డాక్టర్ వి శివకుమార్, ఏపీఎంఐపి పిడి ఎ. దుర్గేష్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎన్. మల్లికార్జునరావు, కడియం ఉద్యాన శాఖ అధికారి పి.లావణ్య పాల్గొన్నారు.
జర్మనీ భాషలో ఉచిత శిక్షణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గల ఎస్సీ,ఎస్టీ కులాలకు చెందిన నర్సింగ్ పట్టభద్రులకు జర్మనీ భాషలో బి2 స్థాయి కోసం ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశం కల్పించటానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత శాఖ అధికారి ఎమ్.డి. గవాజుద్దీన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకునే విద్యార్థి వయసు 35 సంవత్సరములు లోపు ఉండాలన్నారు. బీఎన్ఎం గాని, బీఎస్సీ నర్సింగ్ కోర్సు గాని చదివి ఉండాలన్నారు. ఆసక్తి గల విద్యార్థినీ విద్యార్థులు ఆగస్టు 6వ తేదీలోపు అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక అయిన విద్యార్ధులకు 8 నుంచి 10 నెలల వరకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. శిక్షణ విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలలో మాత్రమే ఇస్తారన్నారు. పూర్తి వివరాల కోసం మొబైల్ నంబర్లు 99488 68862, 83400 94688 లలో సంప్రదించాలన్నారు.
పింఛన్ల పేరిట వంచన
రాజమహేంద్రవరం రూరల్: కూటమి ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన ఉండదని మరోసారి తేలింది. కూటమి హామీలతో మోసపోయిన జాబితాలో తాజాగా వితంతువులు కూడా చేరారు. భర్త మరణిస్తే భార్యకు ఇవ్వాల్సిన పెన్షన్ను కూడా ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు సర్కార్కే దక్కుతుంది. జిల్లా వ్యాప్తంగా 3,801 మందికి స్పౌజ్పెన్షన్ రెండు నెలలు కింద మంజూరైందంటూ తెలిపి ఈ ఏడాది జూన్ 12వ తేదీన పెన్షన్ ఇస్తామని నమ్మబలికారు. తాజాగా మరోసారి పెన్షన్ ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నామంటూ ప్రచారార్భాటానికి దిగారు. అర్హులని తేలినప్పటికీ 3,801 మందికి నెలకు రూ.1.52 కోట్ల చొప్పున రెండు నెలలకి రూ.3.04 కోట్లు ఎగ్గొట్టింది. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళలను ప్రభుత్వం తరఫున వీలైనంత త్వరగా ఆదుకోవాల్సి పోయి ఇలా ఆలస్యం చేసి వారిని వంచించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

నేడు పింఛన్ల పంపిణీ