
పవిత్ర క్షేత్రాల్లో ఆధ్యాత్మిక యాత్ర
బోట్క్లబ్ (కాకినాడసిటీ): పవిత్ర క్షేత్ర సందర్శనలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టినట్టు ఇండియన్ రైల్వేస్ సౌత్ స్టార్ రైల్, టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ జీ తెలిపారు. కాకినాడ ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. యాత్ర సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభం అవుతుందన్నారు. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, హైదరాబాద్, కాజీపేట స్టేషన్లలో యాత్రికులు రైలు ఎక్కే వీలుందన్నారు. ఈ యాత్ర పదిహేను రోజులు సాగుతుందన్నారు. ఇండియన్ రైల్వేస్, భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు, సౌత్ స్టార్ రైలు, భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన అగ్రశ్రేణి టూరిస్ట్ రైలు ఆపరేటర్ ‘టూర్ టైమ్స్’ ఈ యాత్రకు నడుం బిగించిందన్నారు. ఈ యాత్రలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారక, సిద్ధపూర్, మధుర, అయోధ్య, ప్రయాగ్రాజ్, వారణాసి, గయ వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శించుకునే వీలుంటుందన్నారు. గతంలో ఇండియన్ రైల్వేస్ టూర్ టైమ్స్ ప్యాకేజీకి విశేష స్పందన లభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి 650 మంది యాత్రికులతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా టూర్ టైమ్స్ జనరల్ మేనేజర్ సంతోష్ మాట్లాడుతూ ప్రాచీన గ్రంథాలు, పురాణాల ప్రకారం ఈ యాత్రలో ఉన్న క్షేత్రాలు ఎంతో పేరుగాంచాయన్నారు. ఈ రైలు లోపల, బయట దక్షిణ భారత భోజనం అందుబాటులో ఉంటుందన్నారు. లగేజీ భారం ఉండదన్నారు. దర్శనానికి అవసరమైన బ్యాగ్ మాత్రమే మోయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్యాకేజీపై ఇండియన్ రైల్వే 33 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. టికెట్ ధరలు థర్డ్ ఏసీ రూ.45,750, సెకెండ ఏసీ రూ.54,100, ఫస్ట్ ఏసీ రూ.69500 ఉంటాయన్నారు. అనంతరం యాత్ర పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ యాత్ర టికెట్లను 93550 21516 నంబర్కు ఫోన్చేసి బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో టూర్ టైమ్స్ మేనేజర్ యాకేశ్ పాల్గొన్నారు.