ఉండవెల్లి: జాతీయ స్థాయిలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన సురవరం సుధాకర్రెడ్డి నేటి తరానికి ఆదర్శప్రాయుడని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు సంపత్, చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్పర్సన్ సరిత అన్నారు. బుధవారం మండలంలోని కంచుపాడులో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ప్రథమ సంస్మరణ సభను కుటుంబ సభ్యులు సురవరం విజయలక్ష్మి, నిఖిల్, కపిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ.. సుధాకర్రెడ్డి మారుమూల గ్రామం నుంచి జాతీయ స్థాయికి ఎదిగి, పార్లమెంట్లో పేదలు, బడుగు బలహీన పక్షాన గళం వినిపించారని కొనియాడారు. రాష్ట్రంలోని ఏదైనా యూనివర్శిటీకి లేదా కళాశాలకు సురవరం పేరు పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. ప్రాగటూరు లిఫ్టు నుంచి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందించి అన్నదాతను ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఎంపీ నిధులు రూ.50 లక్షలతో మండలంలో అభివృద్ధి పనులు, మరో రూ.10 లక్షలతో కంచుపాడులో సుధాకర్రెడ్డి విగ్రహం, అభివృద్ధి పనులు చేపడతామని ఎంపీ మల్లు రవి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణం, గ్రంథాలయం, సురవరం సుధాకర్రెడ్డి హాల్ను ప్రారంబించారు. కార్యక్రమంలో సర్పంచు నాగలక్ష్మమ్మ, మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డెప్ప, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్గౌడ్, గోపాల్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.


