అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. శుక్రవారం ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుందని రిటర్నింగ్ అధికారి ప్రసాదరావు వెల్లడించారు. అమరచింత సహకార సంఘంలో 760 ఓట్లు ఉండగా.. మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 250 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణకు ప్రొసీడింగ్ అధికారితో పాటు 14 మంది సిబ్బందిని కేటాయించారు. అదేవిధంగా కొత్తకోట చేనేత సహకార సంఘంలో 78 మంది ఓట్లు ఉండగా.. ఒకే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు ప్రొసీడింగ్ అధికారితో పాటు నలుగురు సిబ్బందిని నియమించారు. పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల దూరం వరకు దుకాణాలు తెరవకుండా ముందస్తు సమాచారం ఇచ్చారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు కోరినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని.. సాయంత్రం ఫలితాలు వెల్లడించి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఉంటుందని రిటర్నింగ్ అధికారి వివరించారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు


