ఎక్కడ.. ఎలా.. ఎవరు?
● పలు పురపాలికల్లో చైర్మన్, వైస్ చైర్మన్లు ఖరారు
● కొన్నింటిలోకొనసాగుతున్న సస్పెన్స్
● నాగర్కర్నూల్ పురపాలిక హస్తగతమైంది. చైర్మన్ బీసీ జనరల్కు రిజర్వ్ కాగా.. తీగల సునేంద్ర పేరు ప్రచారంలో ఉంది. వైస్ చైర్మన్గా బాదం రమేష్ పేరు వినిపిస్తోంది.
● అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యత సాధించింది. ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా సీఎం సురేష్ను ముందుగానే ప్రకటించారు. వైస్ చైర్మ న్ అభ్యర్థి పేరు ఇంకా ప్రకటించలేదు.
● మక్తల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యత సాధించి చైర్మన్ జనరల్కు రిజర్వ్ కాగా.. సరిత మక్తల్, శైవీరెడ్డి, కోళ్ల సంధ్య, అల్ కురుపావళని పదవి ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ కోసం మహేష్, జుట్ల అనిత ప్రయత్నిస్తున్నారు.
● కల్వకుర్తి పురపాలికలో కాంగ్రెస్ పాగా వేసింది. చైర్మన్ జనరల్ మహిళకు రిజర్వ్ కా గా.. రత్నమాల పేరును ఖరారు చేశారు. వైస్ చైర్మన్గా షానవాజ్ ఖరారైనట్లు సమాచారం.
● మద్దూరు మున్సిపాలిటీ హస్తగతం కాగా.. చైర్మన్ పదవి బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. కాంగ్రెస్ ఇప్పటివరకు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించలేదు. మున్సిపాలిటీలో విలీనమైన రేణివట్ల నుంచి పదో వార్డులో గెలుపొందిన గడ్డమీది గోవిందు ఈ పదవిని ఆశిస్తున్నారు. మూడో వార్డు నుంచి గెలుపొందిన జీడి మౌనిక, 16వ వార్డు నుంచి విజయం సాధించిన డిల్లికర్ సరస్వతిలో ఎవరికో ఒకరికి చైర్మన్ పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.
కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. కాంగ్రెస్ నుంచి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్యకుమారి, మాజీ సర్పంచ్ శ్రీదేవి గౌతమ్గౌడ్, వంగ అనూ ష రాజశేఖర్గౌడ్, గుండ్రాతి స్వప్న శిల్ప, పసుల సుజా త చైర్పర్సన్ పదవికి పోటీలో ఉన్నారు. వైస్ చైర్మన్ కోసం ముస్లిం, ఎస్టీ వర్గానికి చెందిన కౌన్సిలర్లు ప్రయత్నం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలికల్లో సోమవారం కొత్త పాలక మండళ్లు కొలువుదీరనున్నాయి. కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా పలు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను అధిరోహించేది ఎవరనే దానిపై కొన్ని చోట్ల స్పష్టత వచ్చింది. మరికొన్నింటిలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఆశావహులు అధికంగా ఉండడం.. పోటాపోటీ నెలకొనడంతో ఆయా పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రిజర్వేషన్ ప్రకారం ఆయా పదవులకు ఎంపికై న వారి పేర్లను ప్రకటించకుండా గోప్యతను పాటిస్తుండగా.. ప్రమాణ స్వీకారం సమయానికి క్తొ ముందస్తుగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దేవరకద్ర మున్సిపాలిటీలో చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. కాంగ్రెస్ పీఠం దక్కించుకోనుంది. మున్నూరు కాపు వర్గానికి చెందిన కొండా దమయంతిని ఎన్నికల సమయంలోనే చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే సమయంలో వైస్ చైర్మన్ విషయంపై చర్చించారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి 12వ వార్డులో గెలిచిన యుగంధర్ రెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వీరిలో ఒకరికి వైస్ చైర్మన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన మరో అభ్యర్థి సైతం వైస్ చైర్మన్ ఇస్తే పార్టీ మారేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
భూత్పూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కై వసం చేసుకుంది. చైర్మన్ పదవి ఎస్టీ జనరల్కు రిజర్వ్ కాగా.. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లోకి వచ్చిన బాల్కోటిని ఎన్నికల ప్రచార సమయంలోనే ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన గెలుపొందడంతో చైర్మన్గా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
వనపర్తి చైర్మన్ పీఠం జనరల్ మహిళ రిజర్వ్ కాగా.. ఈ పదవికి ముగ్గురు పోటీ పడుతున్నారు. చీర్ల రజినీ చందర్, ఎస్ఎల్ఎన్ మాధవి రమేష్తో పాటు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ధనలక్ష్మి ఆశిస్తున్నారు.
పెబ్బేరు మున్సిపాలిటీ పీఠం జనరల్కు రిజర్వ్ కాగా.. సుమిత్రా ఎల్లారెడ్డి, అక్కి శ్రీనివాస్ గౌడ్ పదవిని ఆశిస్తున్నారు. చైర్పర్సన్ ఎంపికపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. దీనిపై క్లారిటీ వస్తేనే వైస్ చైర్మన్ ఎవరనేది తెలుస్తుంది.
ఆత్మకూర్ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. పదో వార్డు నుంచి కౌన్సిలర్గా గెలుపొందిన జుబేదాబేగం, ఏడో వార్డు నుంచి విజయం సాధించిన నాగమణి ఈ పదవిని ఆశిస్తున్నారు. ఎవరనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
కొత్తకోట మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళకు రిజ ర్వ్ కాగా.. పోతులపల్లి అరుణ శ్రీనివాస్ పేరు ను కాంగ్రెస్ నేతలు ఇదివరకే ప్రకటించారు. వైస్ చైర్మన్గా పి.పల్లవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కోస్గి మున్సిపాలిటీని కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేసింది. చైర్మన్ పదవి జనరల్కు రిజర్వ్ కాగా.. ఎన్నికల ముందే నాగులపల్లి నరేందర్కు డిక్లేర్ చేశారు. వైస్ చైర్మన్గా మున్సిపాలిటీలోని విలీన గ్రామాలకు కేటాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోవర్దన్ రెడ్డి సతీమణి చింతల సరితకు అవకాశం దక్కనుంది. గత ఎన్నికల్లో చైర్మన్గా బెజ్జు సంగీత ప్రమాణ స్వీకార సమయంలో ఎక్స్ అఫీషియో ఓట్లతో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల్లో బీఆర్ఎస్కు పీఠం దక్కగా.. ఆమె చైర్మన్ కాలేకపోయారు. ఈసారి సైతం కౌన్సిలర్గా గెలుపొందిన ఆమె వైస్ చైర్మన్ సీటుపై ఆశలు పెట్టుకున్నారు.
అలంపూర్ చైర్మన్ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. ఈ పీఠం బీఆర్ఎస్కు దక్కే అవకాశం ఉండగా.. ఆ పార్టీ నుంచి ఆరో వార్డులో గెలుపొందిన జయరాముడికి చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. వైస్ చైర్మన్ పీఠాన్ని ఆసిఫుద్దీన్ ఖాన్, మాధురితో పాటు ఏకగ్రీవంగా ఎన్నికై న విక్రం ఆశిస్తున్నారు.
నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్ బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ సతీమణి కొండ శ్వేత, పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్ భార్య కల్పన, పార్టీ సీనియర్ నాయకురాలు మంజుల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం క్యాంప్ రాజకీయాలు నడుస్తుండగా.. బీజేపీ శిబిరానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వచ్చి.. అధిష్టాన నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. చైర్పర్సన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎంపీ డీకే అరుణకు వదిలేసినట్లు తెలిసింది.
వడ్డేపల్లి మున్సిపాలిటీ పీఠం బీసీకి రిజర్వ్ అయింది. ఇక్కడ ఏఐఎఫ్బీ నుంచి వడ్డేపల్లి శ్రీనివాసులు తరఫున బరిలో నిలిచి ఎనిమిది మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత అందరూ కాంగ్రెస్ గూటికి చేరారు. వడ్డేపల్లి శ్రీనివాసులు కుమారుడు అజయ్కుమార్ తొమ్మిదోవార్డు నుంచి పోటీ చేయగా.. ఆయనే చైర్మన్ అభ్యర్థి అని భావించారు. కానీ అతడు ఓటమి పాలు కావడంతో ఈ పదవిపై సందిగ్ధత నెలకొంది. ఇదే ప్యానల్లో ఐదో వార్డులో గెలిచిన యుగంధర్ శ్రీనివాసులుకు స్వయానా తమ్ముడి కొడుకు కాగా.. ఆయన ఆశలు పెట్టుకున్నారు. నాలుగో వార్డు నుంచి గెలుపొందిన మంజుల సైతం పదవిని ఆశిస్తున్నారు. ఎవరికి ఇచ్చినా ప్యానల్లో చీలిక వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


