
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 73 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ సంతోష్ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా శాఖలకు చెందిన అధికారులను పిలిచి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్కు 13 అర్జీలు
గద్వాల క్రైం: పోలీస్ గ్రీవెన్స్లో భాగంగా ఎస్పీ శ్రీనివాసరావు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 13 అర్జీలు రాగా.. అందులో ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగాదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడంలేదని వచ్చినట్లు వివరించారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని ఎస్పీ సూచించారు.