
ఉగ్ర రక్కసిపై ఆగ్రహజ్వాల
జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ,
మృతులకు నివాళి
గద్వాలటౌన్: జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని సకల జనులు ముక్త కంఠంతో ఖండించారు. ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మృత్యువాత పడటంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పాత బస్టాండ్ చౌరస్తా నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు ప్రధాన రహదారుల వెంట కొవ్వొత్తులు, జాతీయ జెండాలు చేతపట్టి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పార్టీ ఇన్చార్జి సరిత, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ మాట్లాడారు. ఉగ్ర శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు దేశమంతా ఐక్యంగా ఉందన్నారు. పర్యాటకులపై ఉగ్రమూకల జరిపిన దాడి హేయమైన చర్యఅని మండిపడ్డారు. దేశంపై ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్న ఉగ్ర మూకలను అంతం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్బాబు, ఇసాక్, డీటీడీసీ నర్సింహా, పులిపాటి వెంకటేష్, బాస్కర్యాదవ్, జగదీష్, రాజశేఖర్రెడ్డి, ఆనంద్, తిమ్మోతి, సురేష్, ఆనంద్గౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నల్ల బ్యాడ్జిలతో ప్రార్థనలు
జమ్ము కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా ముస్లింలు తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాలోని ముస్లింలు నల్ల బ్యాడ్జిలను ధరించి మసీదులలో ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదు బయట ఫ్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మత పెద్దలు మాట్లాడారు. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి ప్రతి ఒక్కరి మనసును కలచివేసిందన్నారు. దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధకరమన్నారు. మనదేశ శాంతి, ఏకత్వాన్ని బలహీనపరచడానికి విదేశీ శక్తులను అనుమతించేది లేదన్నారు.

ఉగ్ర రక్కసిపై ఆగ్రహజ్వాల