● బొగ్గు కుంభకోణంపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు
● సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
వెంకన్న జాదవ్
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతీ దశను అత్యంత పారదర్శకంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షిస్తున్నామని సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్) వెంకన్న జాదవ్ తెలిపారు. సోమవారం భూపాలపల్లి ఏరియాలో పర్యటించిన ఆయన ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డితో కలిసి ఓసీ–2 ఉపరితల గనిలోని లోడింగ్ బంకర్ను పరిశీలించి అక్కడి కార్యకలాపాలను సమీక్షించారు. అనంతరం జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కొన్ని మీడియా వేదికల్లో సింగరేణి బొగ్గు చోరీకి గురవుతోందని, బొగ్గు అదృశ్యమవుతోందని వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, రవాణా, విక్రయాలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతున్నాయని తెలిపారు. గనుల్లో బొగ్గు ఉత్పత్తి అయిన క్షణం నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతీ టన్ను బొగ్గుకు సంబంధించిన సమాచారం సాప్ కోల్నెట్ వంటి ఆన్లైన్ వ్యవస్థల్లో నమోదు అవుతుందన్నారు. సింగరేణిలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో సుమారు 85 శాతం రైల్వే మార్గం ద్వారా, 15 శాతం రోడ్డు, ఇతర మార్గాల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఓసీ–2 ప్రాజెక్టు అధికారి శ్యామ్సుందర్, డీజీఎం (క్వాలిటీ) కృష్ణప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ పోషమల్లు పాల్గొన్నారు.


