● అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల
భూపాలపల్లి అర్బన్: రాజీమార్గాన్ని ఎంచుకొని వివాదాలకు దూరంగా ఉండాలని, శాంతియుత జీవితాన్ని గడపాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. కోర్టుల్లో సంవత్సరాల తరబడి కొనసాగే కేసులను రాజీమార్గం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రజలు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకొని కేసుల నుంచి బయటపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఏపీపీ ప్రదీప్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కె.అక్షయ, సీఐలు, ఎస్ఐలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యోగాసనాల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. జడ్జి అఖిల పాల్గొని న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి వివిధ యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ శివకుమార్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ అక్షయ, న్యాయవాదులు ప్రియాంక, రత్నం కిరణ్, మొయినుద్దీన్, అశోక్రెడ్డిలు పాల్గొన్నారు.


