భూపాలపల్లి అర్బన్: బాలకార్మికులను పనిలో పెట్టుకోవద్దని సీసీఎస్ సీఐ రమేష్ సూచించారు. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ సందర్భంగా బుధవారం జిల్లాకేంద్రంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీసీఎస్ పోలీసులు, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్టీయూ) అధికారులు, ఇతర శాఖల సిబ్బంది సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న భవనాలు, ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు, మెకానిక్ షాపులు, స్క్రాప్ దుకాణాలు, బేకరీలు, ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎస్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. బాల కార్మికులను నియమించుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల కార్మికుల సమాచారం తెలిసిన వారు వెంటనే 1098 చైల్డ్ హెల్ప్లైన్ నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తోడ్పడాలని అధికారులు పిలుపునిచ్చారు.


