● డీఈఓ రాజేందర్
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ (ఎన్జీసీ), జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఏక్ పెడ్ మా కే నామ్’ జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనం పెరగడంతో పాటు ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యతాభావం పెంపొందుతాయన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి విజయపాల్రెడ్డి, సీఎంఓ రమేష్, ప్లానింగ్ ఆఫీసర్ రాజగోపాల్, ఏఎస్ఓ రామకృష్ణ, జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, సూపరింటెండెంట్ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్లు శ్రీకాంత్, ప్రశాంత్లు పాల్గొన్నారు.


