భూపాలపల్లి అర్బన్: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.కన్నయ్యలాల్ సూచించారు. సోమవారం న్యాయవాదులు, కోర్టు కానిస్టేబుళ్లతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి లోక్ అదాలత్ విజయవంతానికి అవసరమైన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో రాజీ మార్గాన్ని ప్రోత్సహించాలని కోరారు. లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాలు స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్నారు. సివిల్ కేసుల్లో రాజీ కుదిరిన వారికి చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి అందజేయబడుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందరపు శివకుమార్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, న్యాయవాదులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


