ఏటూరునాగారం: ఏజెన్సీలోని ప్రజలకు జీసీసీ సేవలను మరింత విస్తరింపజేయాలని, జీసీసీ పెట్రోల్ బంక్లను నడిపించాలని, చిన్న అటవీ ఉత్పత్తులను సేకరణ చేపట్టాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో పీఓ జీసీసీ డివిజనల్ మేనేజర్, సొసైటీ మేనేజర్లు, అకౌంటెంట్లతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, గృహ అవసరాలు, వ్యవసాయ ఉత్పత్తులు, చిన్న అటవీ ఉత్పత్తుల కింద సొసైటీల వారీగా లక్ష్యాలు పెట్టుకొని వాటి దిశగా వెళ్లాలన్నారు. అలాగే గ్యాస్ గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లు, జీసీసీ ఫిల్లింగ్ స్టేషన్ల పనితీరు మరింత మెరుగు పడాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని గృహ అవసరాల డిపోల పనితీరు, డిపోల వారీగా గత సంవత్సరం లాభాల వివరాలను తెలుసుకున్నారు. గిరిజనులకు అవగాహన కల్పిస్తూ అటవీ ఉత్పత్తుల సేకరణ మరింత పెంచాలన్నారు. బంక్లలో తాగునీరు, సీ్త్ర, పురుషులకు మరుగుదొడ్లు, మూత్రశాలలు, లైటింగ్, జనరేటర్, అగ్నిమాపక పరికరాలు, ప్రకటనలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేసి పెట్రోల్ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
ఓటీపీతోనే గ్యాస్ సరఫరా
గ్యాస్ వినియోగదారులకు ఓటీపీతోనే గ్యాస్ సిలండర్లను సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డివిజనల్ మేనేజర్ వాణి, ములుగు, వెంకటాపురం(కె), నర్సంపేట సొసైటీల మేనేజర్లు దేవ్, బాలాజీ, విజయలక్ష్మీ పాల్గొన్నారు.
పీఓ లెనిన్ వత్సల్ టొప్పో


