కాళేశ్వరం: వాతావరణ శాఖ సూచన మేరకు ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని, రైతులకు వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం మహాదేవపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ హసీనాభాను అధ్యక్షతన జరిగిన గ్రామసభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు గురించి ప్రజలకు వివరించినట్లు తెలిపారు. వాతావరణశాఖ సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు. అధికంగా యూరియా వినియోగించకుండా నానో యూరియా వినియోగించేలా రైతులకు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు సవరణ జూన్ 15 నుంచి జరుగుతుందని, దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో జరిగిందని ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో జరుగుతుందన్నారు. ప్రతీ ఇంటికి బూతు స్తాయి అధికారులు వస్తారని ఓటర్లు వివరాలను ఇవ్వాలని తెలిపారు. ఓటరు జాబితాలో సలహాలు సూచనలు, అభ్యంతరాలు ఉంటే తహసీల్దార్కు లిఖితపూర్వకంగా అందజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజ బాబు, ఆర్డీఓ రవీందర్, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ రవీంద్రనాథ్, వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీపాల్, సీడీపీఓ రాధిక, పీఆర్ డీఈ సాయిలు, వైద్యాధికారి సుష్మిత, అటవీశాఖ ఎఫీడీ ఓ రవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఓటరు సవరణకు సహకరించాలి
కలెక్టర్ రాహుల్శర్మ


