భూపాలపల్లి అర్బన్: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సోతుకు ప్రవీణ్కుమార్, మోటపలుకుల రమేష్లు డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన ఇంధన ధరలను నిరసిస్తూ కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్లే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకోవడంతో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజల జీవితం భారంగా మారిందన్నారు. రైతులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అడ్డుకోవడం సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ఇంధన, గ్యాస్ ధరలను తగ్గించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు కుడుదల వెంకటేష్, నూకల చంద్రమౌళి, వేముల శ్రీకాంత్, గనగళ్ల జోగేష్, గోలి లావణ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆందోళన


