
పిల్లర్ల దశలోనే..
మూడేళ్లుగా సా..గుతున్న వైద్య కళాశాల పనులు
భూపాలపల్లి అర్బన్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.162కోట్లతో జిల్లాకేంద్రంలో ప్రారంభమైన ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు మూడేళ్లుగా సా..గుతున్నాయి. పాలకుల పట్టింపులేనితనంతో ఇబ్బందులు తప్పడం లేదు. సరైన ఫ్యాకల్టీ, వసతి, సౌకర్యాలు, సదుపాయాలు లేకపోవడంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు నిబంధనలకు లోబడి లేవని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) 12 అంశాలలో లోపాలను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది.
ఏడుగురితోనే బోధన
మెడికల్ కళాశాలలో మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించి 35 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉంది. ఎనిమిది మంది ప్రొఫెసర్లకు గాను ఇద్దరు, 10మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ఇద్దరు, 17మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ముగ్గురు మాత్రమే ఉన్నారు. మరో నెల రోజుల్లో మరో నూతన బ్యాచ్ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నాయి. మూడో సంవత్సరానికి బోధించేందుకు ఫ్యాకల్టీని నియమించాల్సి ఉంది.
మెరుగుపడకపోతే సీట్ల కోతే..
ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిలో ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం సూచించిన అంశాలను మెరుగుపర్చకపోతే విద్యార్థుల సీట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 100 సీట్లతో ప్రథమ సంవత్సరం సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుంది. విద్యార్థులకు కావల్సిన సౌకర్యాలు, సదుపాయాలు నెలరోజుల్లో కల్పిస్తామని ఎన్ఎంసీకి తెలిపారు. సకాలంలో సౌకర్యాలు కల్పించి ఫ్యాకల్టీని భర్తీచేయకపోతే 50 సీట్లకు తగ్గించే ప్రమాదం పొంచి ఉంది. దీనిపై జిల్లా ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రత్యేక దృష్టి సారించి అన్ని వసతులు సమకూర్చాల్సిన అవసరముంది.
వేగవంతం చేస్తాం..
స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలలో భవన నిర్మాణం మినహా అన్ని చిన్న చిన్న అంశాలను గుర్తించి సరిచేయాలని ఆదేశాలు వచ్చా యి. నెల రోజులలో వాటిని పూర్తిచేస్తాం. సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినం. ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం.
– రాజేంద్రప్రసాద్,
వైద్య కళాశాల ప్రిన్సిపల్, భూపాలపల్లి
రూ.162కోట్లతో నిర్మాణ పనులు
35మంది ఫ్యాకల్టీకి ఉన్నది ఏడుగురే..
వసతులు లేక
వైద్య విద్యార్థుల ఇబ్బందులు
లోపాలను గుర్తించిన ఎన్ఎంసీ

పిల్లర్ల దశలోనే..

పిల్లర్ల దశలోనే..