
అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం
భూపాలపల్లి అర్బన్: జిల్లా అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన ఇందిర ఇల్లు అర్హులైన నిరుపేదలకు చెందాలని పూర్తిస్థాయిలో అధికారులు విచారణ జరిపి అనర్హులను గుర్తించి తొలగించాలన్నారు. తొందరపడి తప్పులు చేయొద్దని, రేషన్ కార్డులు జారీచేసేందుకు విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీలో నాణ్యత ఉండాలని, నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే పైరవీలకు అవకాశం లేకుండా 6ఏ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. మంత్రి, ఎమ్మెల్యేలు చెప్పినా పైరవీలకు అవకాశం లేకుండా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సూచించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులు అన్ని గ్రామాల్లో నిర్వహించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో పాడి గేదెల యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు
ప్రభుత్వ పథకాలు,
అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష

అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకం