
విక్రయాలు ఆగేనా..
మరో ఏడాది గుట్కా నిషేధం పొడిగింపు
భూపాలపల్లి: పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలాలను ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిషేధించగా, మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు ప్రకటనకు ముందే జిల్లాలోని పలువురు హోల్సేల్ వ్యాపారులు అప్రమత్తమై భారీ మొత్తంలో గుట్కా, పాన్ మసాలాలను దిగుమతి చేసుకొని నిల్వ చేసుకున్నారు.
భారీగా నిల్వలు..
గత నెలతో గుట్కా, పాన్ మసాలాల నిషేధం గడువు ముగియనుండటంతో జిల్లాకేంద్రంలోని పలువురు హోల్సేల్ వ్యాపారులు గుట్కా, పాన్ మసాలా, అంబర్, అనార్ తదితర పొగాకు, నికోటిన్ కలిగిన ఉత్పత్తులను భారీ మొత్తంలో దిగుమతి చేసుకొని నిల్వ చేసుకున్నారు. రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచిన గుట్కా, పాన్ మసాలాలను కిరాణ, పాన్షాపులకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు.
మంథని, హనుమకొండ నుంచి..
జిల్లాకేంద్రంతో పాటు మండలాలకు అధికంగా మంథని, హనుమకొండ పట్టణాల నుంచి నిషేధిత గుట్కా, పాన్ మసాలాల ప్యాకెట్ల బస్తాలు వస్తున్న ట్లు తెలుస్తోంది. మంథని, గోదావరిఖనికి చెందిన ఇద్దరు వ్యాపారులు ప్రత్యేక వ్యాన్లలో జిల్లాకు సరఫరా చేస్తుండగా, హనుమకొండ నుంచి ట్రాన్స్పోర్ట్లలో సరుకుల మాటున వస్తున్నట్లు సమాచారం.
జిల్లాలోనే అధిక విక్రయాలు..
పెద్దపల్లి, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో గుట్కా, పాన్ మసాలాల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిత్యం తనిఖీలు చేస్తూ విక్రయదారులు, వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో అక్కడి బడా వ్యాపారులంతా భూపాలపల్లి వైపు చూస్తున్నారు. ఇక్కడ తనిఖీలు అంతంత మాత్రంగానే ఉండటంతో తమ వ్యాపారాన్ని సాఫీగా సాగిస్తున్నారు.
చర్యలు తప్పవు..
ప్రభుత్వం నిషేధించిన గుట్కా, తదితర పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. గుట్కాలు విక్రయించే వారిపై ఇప్పటికే నిఘా ఉంచాం. పొగాకు ఉత్పత్తులతో అనారోగ్యాలకు గురవుతారు. త్వరలోనే విక్రయదారులపై దాడులు నిర్వహిస్తాం
– సంపత్రావు, భూపాలపల్లి డీఎస్పీ
ఉత్తర్వులు జారీచేసిన అధికారులు
జిల్లాలోని హోల్సేల్ షాపుల్లో
భారీగా నిల్వలు