జనగామ రూరల్: సమాజ ఉన్నతికి పాటుపడే నిస్వార్ధపరులు కవులు కళాకారులని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి అన్నారు. కవులు కళాకారుల ఐక్యవేదిక ఏడవ వార్షికోత్సవం పట్టణంలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. కవులు కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు జి.కృష్ణ అధ్యక్షత ముఖ్యఅతిథిగా పద్మశ్రీ గడ్డం సమ్మయ్య, ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి, తెలంగాణ అసెంబ్లీ సహాయ కార్యదర్శి బేతి వీరారెడ్డి పాల్గొన్నారు. తొలుత ఐక్యవేదిక ఏడవ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను నామోజు బాలాచారి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కవులు కళాకారుల కలయిక అనేది ఒక అపూర్వ ఘట్టమని, వీరిని ఏకతాటికి తీసుకొని కార్యక్రమాలు నిర్వహించడం మంచి విషయమన్నారు. కాగా మినీ కవితల పోటీల్లో గెలుపొందిన ఐదుగురు విజేతలకు నగదు పారితోషకం, ప్రశంస పత్రం, మెమొంటో శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కళాకారుల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి పెట్లోజు సోమేశ్వరాచారి, కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి, సాదిక్ అలీ, దేవేందర్, డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, నెల్లుట్ల రవీందర్ రావు, రేణుకట్ల మురళి, అంకాల సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.


