లింగాలఘణపురం: ‘అయ్యో ఏమైంది ఇక్కడ..? ప్రమాదం ఎలా జరిగింది..ఎవరికై నా ఏమన్నా అయ్యిందా..?’ అంటూ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులంతా ఆగి ప్రశ్నించడం మొదలుపెట్టారు. జనగామ– సూర్యాపేట జాతీయ రహదారి నెల్లుట్ల వద్ద కారును బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రగాయాలై రక్తపు మడుగులో పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న డమ్మీ దృశ్యాన్ని పోలీసులు సృష్టించి ఒక్కసారిగా వాహనదారుల్లో ఆందోళన కలిగించారు. ఇదంతా ఎందుకు చేశారంటే.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాల్లో అరైవ్..అలైవ్ కార్యక్రమంలో ప్రయాణికులను చైతన్యం చేసేందుకేనని తెలపడంతో ఒక్కసారిగా జనాలు ఊపిరిపీల్చుకున్నారు. ఈమేరకు పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ.. ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం అందించే రూ.1.50 లక్షల నగదు రహిత చికిత్స పీఎం రాహత్ స్కీంను వివరించారు. అదేవిధంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి అందించే రూ.25వేల ప్రోత్సాహక బహుమతిపై డీసీపీ వివరించారు. క్రార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, జనగామ ఏసీపీ, రఘునాథపల్లి సీఐ శ్రీనివాసురెడ్డి, లింగాలఘణపురం ఎస్సై శ్రాణ్కుమార్, నెల్లుట్ల సర్పంచ్ రామకృష్ణ, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, డాక్టర్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట హైవేపై టెన్షన్..టెన్షన్
డమ్మీ యాక్సిడెంట్ సీన్ క్రియేట్ చేసిన పోలీసులు
అరైవ్..అలైవ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన


