జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు
జనగామ: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు పలు మండలాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా బచ్చన్నపేట, చిల్పూర్, జనగామ, కొడకండ్ల మండలాల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవడంతో ప్రజలు ఉక్కపోతతో సతమతమయ్యారు.
42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
బచ్చన్నపేటలో 42.7డిగ్రీలు, చిల్పూర్లో 42.5 డిగ్రీలు, జనగామ పట్టణంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదే విధంగా కొడకండ్లలో 41.5 డిగ్రీలు, రఘునాథపల్లి, తరిగొప్పుల, వడ్లకొండ, దేవరుప్పుల ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 29 నుంచి 33 డిగ్రీల మధ్య ఉండడం గమనార్హం. జిల్లాలో వడగాలులకు తోడు పగటిపూట తీవ్ర ఎండ కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కరవుతున్నారు. పాదచారులు, రోజువారీ కార్మికులు, ఫుట్పాత్ వ్యాపారులు, చిరు ఉద్యోగులు, ధాన్యం, మక్కలు, ఇతర పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు వస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం సమయంలో జనం, వాహనాల రద్దీ లేక రోడ్లు వెలవెలబోతున్నాయి. వేడిగాలులు తీవ్రమవడంతో వృద్ధులు, పిల్లల ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసర పనులు తప్ప ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.
గ్రామం ఉష్ణోగ్రతలు
(గరిష్టం)
స్టే.ఘన్పూర్ 41.0
పాలకుర్తి 40.8
లింగాలఘణపురం 40.8
జఫర్గఢ్ 40.6
తరిగొప్పుల 40.5
నర్మెట 40.8
రఘునాథపల్లి 41.1
దేవరుప్పుల 40.2
కొడకండ్ల 41.5
42 డిగ్రీలు దాటుతున్న
ఉష్ణోగ్రతలు
నిర్మానుష్యంగా
మారిన రహదారులు
వడగాలులు, ఉక్కపోతతో
ప్రజల ఉక్కిరిబిక్కిరి


