
పొద్దంతా ఉక్కపోత.. రాత్రి చలి
జనగామ: వాతావరణంలో చోటుచేసుకుంటున్న వింత మార్పులు ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పొద్దంతా ఎండ.. మధ్యాహ్నం ఆకాశంలో మబ్బులు.. రాత్రి ఈదురు గాలులు, చలి.. ఫలితంగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. రాత్రి బాగానే ఉన్నట్టుండి.. తెల్లవారే సరికి అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
జిల్లాలో 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు బస్తీ దవాఖానలు, సబ్ సెంటర్లు, జిల్లా ప్రభుత్వ జనరల్(డీహెచ్) ఆస్పత్రులు ఉన్నాయి. వాతావరణంలో వస్తున్న అనేక మార్పుల కారణంగా జనం ఒళ్లు నొప్పులు, తీవ్ర జ్వరం తదితర సమస్యలతో బాధపడుతున్నారు. పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం పరిస్థితిని మరింత జఠిలంగా మార్చుతోంది. నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్న పంచాయతీల్లో శానిటేషన్ నిర్వహణ గాడి తప్పింది. దోమల స్వైర విహారంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. వెరసి ప్రజలు అనారోగ్యానికి గురై ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. సోమవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సమారు 450 మంది వరకు ఓపీలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో స్వల్ప జ్వరంతో ఉన్నవారు 150 మంది ఉన్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 15 వరకు జిల్లా ఆస్పత్రితో పాటు మండలాల పరిధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 19,463 మంది ఓపీలో పేర్లు నమోదు చేసుకోగా, 391 మంది అడ్మిట్ అయ్యారు. జిల్లా ఆస్పత్రిలో 4,630 మంది ఓపీ, 72 మంది అడ్మిట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ 14,833 మంది, అడ్మిట్ అయిన జ్వర పీడితులు 319 మంది ఉన్నారు. వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన వారికి రక్త నమూనాలు తీసుకుని పరీక్షలు చేస్తూ వైద్యం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ 15 రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు చేరిన రోగుల సంఖ్య 11 వేల వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
నిత్యం పర్యవేక్షణ
జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అందిస్తున్న వైద్య సేవలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పల్లెల్లో నమోదవుతున్న జ్వర పీడితులు, ఇతర రోగ గ్రస్తులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం. సబ్ సెంటర్ల పరిధి గ్రామాల్లో సైతం ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం జ్వరాలు వస్తున్నా తగ్గుముఖం పడుతున్నాయి.
– డాక్టర్ మల్లికార్జున్ రావు, డీఎంహెచ్ఓ
15 రోజుల్లో జిల్లాలోని ఆస్పత్రులకు వచ్చిన రోగుల సంఖ్యా వివరాలు
వాతావరణంలో పెనుమార్పులు
జ్వరాల బారిన జనాలు
రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
15 రోజుల్లో ఓపీ 19,463గా నమోదు
391 మంది అడ్మిట్
ఆస్పత్రి నమోదు ఓపీ అడ్మిట్
డీహెచ్ 4,630 4,558 72
పీహెచ్సీ 14,833 14,514 319

పొద్దంతా ఉక్కపోత.. రాత్రి చలి

పొద్దంతా ఉక్కపోత.. రాత్రి చలి