యైక్లయిన్కాలనీ: అది సింగరేణి ప్రభావిత గ్రామం.. 20వ డివిజన్లోని న్యూమారేడుపాక నరసింహపురం జెడ్పీహై స్కూల్. తరగతి గదులను ఆధునికీకరించారు. డిజిటల్ పద్ధతిన విద్యాబోధన చేస్తున్నారు. హాజరు శాతం పెంచేందుకు ప్రతీనెల అత్యధిక హాజరుశాతం నమోదు చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రోత్సాహక బహుమతులు అందిస్తు న్నారు. విద్యతోపాటు ఆటల్లో పోటీపడేలా విద్యార్థులను నాలుగు గ్రూపులుగా విభజించారు. వాటికి రవీంద్రనాథ్ ఠాకూర్, అబ్దుల్ కలాం, ఝన్సీరాణి, సీవీ రామన్, శకుంతలాదేవి వంటి పేర్లు పెట్టారు. స్కౌట్స్ అండ్ గైడ్స్లోనూ శిక్షణ ఇస్తున్నారు. గతంలో 80 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 105మందికి చేరారు. ఇందులో 30 మంది పదో తరగతి విద్యార్థులు ఉండడం విశేషం. గతేడాది టెన్త్లో వంద శాతం ఉత్తీర్ణత సాదించడంతోపాటు నలుగురు విద్యార్థులకు 500కుపైగా మార్కులు సాధించారు. బాడిబాట ద్వారా 30 మంది విద్యార్థులను చేర్చుకున్నారు.
వంటగది.. డైనింగ్ హాల్ నిర్మాణం
తరగతి గదులు, మూత్రశాలలు, వంటగది, డైనింగ్హాల్ లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్కు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే.. సింగరేణి ఆర్జీ–2 అధికారులతో మాట్లాడి దాదాపు రూ.9 లక్షలు మంజూరు చేయించగా.. ప్రహరీ, బడి వరకు సీసీరోడ్డు, వంటగది, డైనింగ్ హాల్ నిర్మించారు. ఆరు నుంచి పదో తరగతి వరకు తరగతి గదులను డిజిటల్ బోధనకు అనుకులంగా తీర్చిదిద్దారు. స్టేజీ నిర్మించారు. బాల బాలికలకు వేరువేరుగా ప్రత్యేకంగా మూత్రశాలలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
రోజూ ప్రత్యేక తరగతులు
పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించేలా ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారు.
ఆహ్లాదం పంచుతున్న చెట్లు..
పాఠశాల ఆవరణలోని మొక్కలు, చెట్లకు గణిత ఉపాధ్యాయురాలు పద్మ కుమారి సహకారంతో విద్యార్థులు రంగులు వేశారు. అందంగా తీర్చిదిద్దారు. వాటిద్వారా కలిగే ప్రయోజనాలు గురించి విద్యార్థులకు వివరిస్తున్నారు. పచ్చదనంతో ఆహ్లాదం పంచుతున్న చెట్లు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి.
డిజిటల్ విద్యాబోధన
ఆకట్టుకునే తరగతి గదులు
పచ్చని చెట్లు.. అందమైన బొమ్మలు
హాజరు శాతం పెంచేందుకు ప్రతీనెల ప్రోత్సాహకాలు
ఆదర్శంగా న్యూమారేడుపాక ప్రభుత్వ పాఠశాల


