పాఠశాలలకు అమావాస్య ఎఫెక్ట్ అన్నిచోట్లా హాజరైన ఉపాధ్యాయులు పిల్లను బడికి పంపని తల్లిదండ్రులు జిల్లావ్యాప్తంగా 10.35 శాతం మాత్రమే హాజరు
జగిత్యాల: ఈనెల 12నే పునఃప్రారంభం కావాల్సిన పాఠశాలలు ఉష్ణోగ్రతల నేపథ్యంలో 15 వరకు పొడిగించారు. అయితే సోమవారం అమావాస్య కావడంతో ఆ ప్రభావం ప్రభుత్వ పాఠశాలలపై తీవ్రంగా పడింది. విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా కేవలం 10.35 శాతం పిల్లలే బడికి హాజరయ్యారు. ఉపాధ్యాయులు ఉదయమే స్కూల్కు వెళ్లి విద్యార్థులకు స్వాగతం పలికేలా కొబ్బరి ఆకుల తోరణాలు, బెలూన్స్తో స్వాగత ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛభారత్ కింద గదులను శుభ్రం చేశారు. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో హాజరైనా విద్యార్థులు రాకపోవడం గమనార్హం.
నంచర్లలో
పూలతో స్వాగతం
పెగడపల్లి: మండలంలోని నంచర్ల, నందగిరి తెనుగువాడ, నామాపూర్ గ్రామాల్లోని పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు సర్పంచులు రజిత, వనజ, రజిత, అరుణ పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా స్వాగతం పలికారు. మండలవ్యాప్తంగా 6 యూపీఎస్, 26 ప్రాథమిక, 6 హైస్కూళ్లు ఉన్నాయి. 2144 మంది విద్యార్థులకు 223 మంది హాజరైనట్లు ఎంఈవో సులోచన తెలిపారు.
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలంలోని అన్ని పా ఠశాలలు విద్యార్థులు రాకపోవడంతో బోసిపోయాయి. మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఖాళీగా ఉండకుండా అడ్మిషన్లు చేయించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు మండలంలోని కోనరావుపేట పంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది. చేరిన విద్యార్థులకు రూ.2 వేలు అందిస్తామని ప్రకటించింది. ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లతో కలిసి ఇంటింటికీ తిరుగు తూ ప్రైవేటుకు ధీ టుగా ప్రభుత్వ పా ఠశాలలో ఉత్తమ బోధన, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, పుస్తకాలు, యూనిఫాం అందుతోందని సర్పంచ్ గంగారెడ్డి, ఉపసర్పంచ్ పరంధాములు, వార్డు సభ్యులు కోరుతుండడం గమనార్హం.
అమావాస్యతో
హాజరు శాతం తగ్గింది
పాఠశాలలు 836
విద్యార్థులు 46,608
హాజరైంది 4822
శాతం 10.35
అమావాస్య కావడంతో విద్యార్థులు హాజరు కాలేదు. 10.35 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఇప్పటికే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేశాం. పుస్తకాలు, నోట్బుక్స్ అందజేశాం. త్వరలోనే పిల్లలందరికీ యూనిఫామ్స్ అందిస్తాం. – రాము, డీఈవో


