జగిత్యాల: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు ఉచితంగా జ్యూట్ బ్యాగుల పంపిణీ చేసి మాట్లాడారు. వీధి వ్యాపారులు ప్లాస్టిక్ను పూర్తిగా నియంత్రించి కాలుష్య నియంత్రణ మండలి అందిస్తున్న క్లాత్, జ్యూట్ బ్యాగులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫుట్పాత్లు ఆక్రమించి షెడ్లు వేయకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, కాలుష్య నియంత్రణ మండలి నోడల్ ఆఫీసర్ మహేశ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, చందు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కొత్త సబ్స్టేషన్లు
కథలాపూర్(వేములవాడ): నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అదనంగా కొత్తగా సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ సుదర్శనం పేర్కొన్నారు. శుక్రవారం కథలాపూర్ మండలం సిరికొండలో 33/11 కేవీ, కథలాపూర్లో 220/132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులు పరిశీలించారు. సిరికొండ సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ తరలింపు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ నెల 30 లోగా పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరా చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఆయన వెంట డీఈలు మధుసూదన్, గంగారాం, ఏడీఈ రఘుపతి, ఏఈలు దివాకర్రావు, శ్రీనివాస్, రహీం, నవీన్కుమార్ ఉన్నారు.


