కోటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

కోటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

Jun 11 2026 7:41 AM | Updated on Jun 11 2026 7:41 AM

● అడిషనల్‌ కలెక్టర్‌ రాజాగౌడ్‌ సూచన ● ఉద్యోగిపై మున్సిపల్‌ చైర్మన్‌కు ఫిర్యాదు

వెల్గటూర్‌: కోటిలింగాల శ్రీకోటేశ్వరస్వామి ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. మూడు నెలల 20 రోజులకు రూ.1,88,799 వచ్చినట్లు ఈవో కాంతారెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖ పరిశీలకులు ఎం.రాజమౌళి, చైర్మన్‌ పూదరి రమేష్‌, సర్పంచ్‌ కోటయ్య, ధర్మకర్తలు గుమ్ముల వెంకటేష్‌, రవి, రాయకోటయ్య, శ్రీవల్లి సేవా సమితి మహిళలు, అర్చకులు సంజీవ్‌ శర్మ, నాగరాజు, అన్వేష్‌, కార్తీక్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మాదిగకుంట పనులు ప్రారంభించండి

రాయికల్‌: పట్టణంలోని మాదిగకుంటలో మురికి నీరు నిల్వ లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అడిషనల్‌ కలెక్టర్‌ రాజాగౌడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌గౌడ్‌ను ఆదేశించారు. ‘కలెక్టర్‌ ఆదేశించినా కదలని పనులు’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి అడిషనల్‌ కలెక్టర్‌ స్పందించారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు చేపట్టేలా చూడాలని, వర్షాలు పడితే నీరంతా కుంటలోకి చేరే అవకాశం ఉందని తెలిపారు.

కొండగట్టులో జూ. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల పూజలు

మల్యాల: ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు బుధవారం దర్శించుకున్నారు. ఎన్టీఆర్‌ తల్లి నందమూరి షాలిని, అత్త నార్నే మల్లీశ్వరికి ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. మల్లీశ్వరి హనుమాన్‌ దీక్ష తీసుకున్న సందర్భంగా కుటుంబంతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

కాంట్రాక్టర్‌గా.. వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌

మెట్‌పల్లి: మున్సిపాలిటీలో ఆయనో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి. ఇంజినీరింగ్‌ విభాగంలో వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఆ విభాగం పరిధిలో చేపట్టే పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఆ పనితోపాటు కొంతకాలంగా ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్ల పేరిట గుట్టుగా అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నాడు. నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు కాంట్రాక్ట్‌ పనులను సొంతంగాగానీ, బినామీ పేర్ల మీదగానీ చేయరాదు. కానీ సదరు ఉద్యోగి బినామీ పేర్ల మీద రూ.లక్షలాది పనులను దక్కించుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఆయన బినామీ బాగోతాన్ని ఇటీవల గుర్తించిన స్థానిక కాంట్రాక్టర్ల సంఘం నాయకులు మున్సిపల్‌ చైర్మన్‌ మైలారపు లింబాద్రిని కలిసి ఫిర్యాదు చేశారు. అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించా లని, లేకుంటే తాము పనులను చేయబోమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మున్సిపల్‌లో చర్చనీయాంశంగా మారింది.

చమురు ధరలు తగ్గించండి

జగిత్యాలటౌన్‌: కేంద్రప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం ఆధ్వర్యంలో నాయకులు బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. విశ్వనాథం మాట్లాడుతూ చమురు ధరల పెంపుతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రజల కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు. నాయకులు ఇరుగురాళ్ల భూమేశ్వర్‌, సుతారి రాములు, ఎండీ.ముఖ్రం, మునుగూరి హన్మంతు, వెన్న మహేష్‌, కొక్కుల శాంత, ఎన్నం రాధ, ఎండీ.ఉస్మాన్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement