కోరుట్ల: పట్టణంలోని చారిత్రక కట్టడాలైన గడి బురుజుల స్థలాలను కాపాడుకుందామని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బురుజు స్థలాల పరిరక్షణకు మూడు రోజులుగా చేస్తున్న అఖిలపక్షం, ప్రజాసంఘాల నిరసన దీక్షలకు ఎమ్మెల్యే గురువారం మద్దతు తెలిపారు. స్థలాలపై విధించిన వీఎల్టీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష, ప్రజా సంఘాల జేఏసీ నాయకులు చెన్నా విశ్వనాథం, పేట భాస్కర్, ఎండీ.ముజాహిద్, చింతా భూమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే ఆర్టీసీ విలీన గెజిట్
బీఆర్ఎస్ హయాంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జీవో గెజిట్ నోటిపికేషన్ విడుదల చేశామని, ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం అపాయింట్మెంట్ ఇస్తే ప్రక్రియ పూర్తవుతుందని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. డిమాండ్లు నెరవేర్చాలని రెండురోజులుగా సమ్మె చేస్తున్న కోరుట్ల, మెట్పల్లి ఆర్టీసీ కార్మికులకు గురువారం సంఘీభావం తెలిపారు. కార్మికుల సమస్యలు న్యాయమైనవని, ప్రభుత్వం పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సీఎం మాటలు కోటలు దాటుతాయని, చేతలు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఎండనుంచి కార్మికులు ఉపశమనం పొందేందుకు వారికి గొడుగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


