కరీంనగర్ అర్బన్: ప్రచండ భానుడి ప్రతాపానికి సకల వర్గాలు సతమతమవుతున్నాయి. అప్రకటిత కర్ఫ్యూతో మానవులతో పాటు జంతువులు, పంటలకు ప్రతికూల పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో ఇప్పటికే పలువురు వడదెబ్బతో మరణించారు. గతకొన్ని రోజులుగా 40–43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అరెంజ్ అలర్ట్ జోన్లో ఉండగా రానున్న రోజుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశముందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాల్సిన పదార్థాలేంటీ వంటి వివరాలను వివరించారు.
ఉష్ణోగ్రతలు హెచ్చరిక స్థాయికి చేరినందున రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కూరగాయల తోటలకు ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే నీరు కట్టాలి. టమాట తోటకు నీడ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. షెడ్నెట్ వేసుకుంటే మరీ మంచిది. పండ్ల తోటలకు పెద్దగా ఇబ్బంది లేదు. మామిడికి కోతకు ఒక నెల ముందు నుంచే నీటి సరఫరా నిలిపివేయాలి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే కాయ నాణ్యతగా పెరుగుతుంది. రుచికరంగా ఉంటుంది. తీగజాతి కూరగాయలు, ఆకు కూరలకు ఉదయం, సాయంత్రం వేళలో నీటిని అందించాలి. ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకు నీటిని ఇవ్వకూడదు.
– పల్లె కమలాకర్రెడ్డి, జిల్లా పట్టుపరిశ్రమ, ఉద్యాన శాఖ అధికారి
ఎండల వేళ పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. మూడు పూటలు నీరు అందించాలి. మధ్యాహ్నం వేళలో పశువులపై నీటిని జలకరించాలి. నీడ ఉండే ప్రాంతాల్లోనే పశువులను ఉంచాలి. గ్రామాల్లో ఉండే నీటి తొట్లలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్తో నింపాలి. మూడు భాగాలు ఎండు గడ్డితో పాటు ఒక భాగం పచ్చిగడ్డి వేయాలి. పెంపుడు కుక్కలు అధిక ఉష్ణోగ్రతలకు చిరాకు పడుతుంటాయి. ఆయాసం, ఆకలి ఉంటుంది. ఫుడ్, వాటర్ సకాలంలో ఇవ్వాలి. వాటికి నీడ చల్లగా ఉండేలా చూడాలి. కోళ్ల ఫారాల్లో గన్నీసంచులను చుట్టూ కట్టడంతో పాటు పైన గడ్డి లేదా తుంగను కప్పాలి. రెండు గంటలకోసారి నీటితో తడపాలి.
– తుమ్మల కిరణ్కుమార్రెడ్డి, పశు వైద్యులు
మండుటెండలో స్వీయ జాగ్రత్తలే రక్ష


