జగిత్యాల: పదేళ్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. జీవన్రెడ్డి భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్, హరీశ్రావు విమర్శిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మేడిగడ్డ పరిశీలన 15రోజుల క్రితమే నిర్ణయించారని, కేసీఆర్ జగిత్యాలకు వస్తే సభ పెడుతున్నారని అనడం అవివేకమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ ఏం చేశారని ప్రశ్నించారు. సొంత డబ్బా కోసమే జగిత్యాలలో బహిరంగ సభ పెడుతున్నారని తెలిపారు. కొండగట్టులో 60 మంది బస్సు ప్రమాదంలో మరణిస్తే రాని కేసీఆర్ ఇప్పుడెందుకు వస్తున్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ హరీశ్రావు, కేటీఆర్ కోడిగుడ్డుపై ఈకలు పీకే రకమన్నారు. సంక్షేమ పథకాల అమలు చేస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 2011, 2023లో మహిళాబిల్లుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉందన్నారు. వరదకాలువను ఎల్లంపల్లి ద్వారా నింపితే కాళేశ్వరం నీరు అని అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ను అత్యధికంగా విమర్శించిన జీవన్రెడ్డి నేడు ఆప్తుడు కావడం శోచనీయమన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ తండ్రిపై రౌడీషీటర్ ఓపెన్ చేస్తే తాను తొలగించేలా చేశానని పేర్కొన్నారు. 2014లో గెలిచే అభ్యర్థి లేకుంటేనే తనను పిలిచి టికెట్ ఇచ్చారని, తాను రాజకీయాల్లోకి వచ్చాక కుటుంబ ఆస్తులు తగ్గాయని, దీనికి ఎలాంటి విచారణకై నా సిద్ధమన్నారు. ఎవరు క్రాస్ బ్రీడో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, గిరి నాగభూషణం, సమిండ్ల శ్రీను, కొత్త మోహన్, బండ శంకర్ పాల్గొన్నారు.


