జగిత్యాలక్రైం: అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన అవసరమని, విపత్తు సంభవించినప్పుడు ప్రాణనష్టాన్ని నివారించేందుకు అగ్నిమాపక శాఖ కృషి చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానంపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని, ప్రతిఒక్కరూ మూడు నెలలకోసారి రక్తం దానం చేయాలని సూచించారు. విపత్తులు సంభవించిన సందర్భంలో క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆస్తులు, ప్రాణాలు కాపాడడంలో ముందుండేది అగ్నిమాపక సిబ్బందేనన్నారు. జిల్లా అధికారి సైదులుతోపాటు 23మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కొమురవెల్లి వేణుగోపాల్, జగిత్యాల, ధర్మపురి అగ్నిమాపక కేంద్రం అధికారులు కృష్ణకాంత్, శ్రీకాంత్ సంబంధిత శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ రాణి, సిబ్బంది పాల్గొన్నారు.


