జగిత్యాలక్రైం: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల బాధ్యత అని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న అరైవ్ ఎలైవ్ కార్యక్రమంలో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఊహించలేమని, నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగంతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. రాత్రివేళల్లో వాహనాలు నడిపేవారు. దూర ప్రయాణాలు చేసేవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డ్రైవర్లకు తగిన సూచనలు ఇచ్చి, చూపు సమస్యలు గుర్తించిన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందించారు. మందులు కూడా పంపిణీ చేశారు.


