● సీజీఆర్ఎఫ్ చైర్మన్ నారాయణ
రాయికల్: విద్యుత్ సమస్యల నివారణకు పరిష్కార వేదికలు దోహదపడతాయని ఎన్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్ చైర్మన్ నారాయణ అన్నారు. మండలంలోని ఒడ్డెలింగాపూర్ సబ్స్టేషన్లో బుధవారం వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. రాయికల్, సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోని పలువురు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్నారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక సభ్యులు రామకృష్ణ, శేర్ల సత్యనారాయణ, మర్రిపల్లి రాజాగౌడ్, ఎస్సీ సుదర్శనం, డీఈ గంగారాం, ఎస్ఏవో శ్రీనివాస్, ఏడీఈ సింధూశర్మ, ఏఏవో శంకర్, ఏఈ రాజేశం, తుమ్మల నవీన్, సబ్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు పాల్గొన్నారు.
నిత్యాన్నదానసత్రానికి రూ.80లక్షల విరాళం
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలోని నిత్యాన్నదాన సత్రానికి వేములవాడకు చెందిన భక్తులు అమరగొండ కిషన్ దంపతులు రూ.80వేలు విరాళంగా అందించారు. ఈ మేరకు ఆలయ అధికారులు దాతకు రశీదు అందించి అభినందించారు. ఏఈవో హరిహరనాథ్, ఆలయ పర్యవేక్షకులు అశోక్, భక్తులు పాల్గొన్నారు.
రోడ్డు నిబంధనలు పాటించాలి
రాయికల్: విద్యార్థులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ అన్నారు. బుధవారం రాయికల్ మండలం అల్లీపూర్లో అరైవ్ ఎలైవ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై సుధీర్రావు, సర్పంచ్ ఎంబారి గౌతమి, ఎంఈవో రాఘవులు, హెచ్ఎం కిరణ్, ఉపసర్పంచ్ వినయ్ పాల్గొన్నారు.
17న కొండగట్టు ఆలయ హుండీ లెక్కింపు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలోని హుండీలను ఈనెల 17న లెక్కించనున్నట్లు ఈవో అంజనా రెడ్డి తెలిపారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు కొనసాగుతుందని పేర్కొన్నారు.


