
సర్వేయర్ల పరీక్ష ప్రశాంతం
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం గ్రామపాలన అధికారులు, లైసెన్స్డ్ సర్వేయర్లకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా సాగిందని కలెక్టర్ అన్నారు. ఎస్కేఎన్ఆర్ పరీక్షకేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. లైసెన్స్డ్ సర్వేయర్లు 148 మందికి 127 మంది హాజరయ్యారని, గ్రామపాలన అధికారులు 29మందికి 21మంది హాజరైనట్లు తెలిపారు. త్వరలోనే ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ఆయన వెంట చీఫ్ సూపరింటెండెంట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఇళ్లు కూల్చిన వారిపై చర్యలు తీసుకోండి
● మాజీమంత్రి జీవన్రెడ్డి
జగిత్యాలటౌన్: నూకపల్లి అర్బన్ కాలనీలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించగా.. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు కూల్చివేయించారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కూల్చివేతలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వివిధ దశల్లో ఉన్న వందకుపైగా ఇళ్లను ముందస్తు సమాచారం లేకుండా కూల్చడమేంటని ప్రశ్నించారు. ఇళ్ల కూల్చివేతలో గత ప్రభుత్వ వైఖరి కనిపిస్తోందన్నారు. నష్టపోయిన బాధితులకు ప్రత్యామ్నాయం చూపాలన్నారు. 2018లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పేరిట తొలగించిన రెండువేల మంది లబ్ధిదారులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారని ఆరోపించారు. వారు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లో ఇప్పటికే మంజూరైన లబ్ధిదారులుగా చూపిస్తోందని, తద్వారా వారు డబుల్ ఇళ్లకు అర్హత సాధించలేకపోయారని తెలిపారు. 2023లో అప్పటి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వసతులు కల్పించకుండా ఇళ్లు కేటాయించారని, ఆ ఇళ్లలో ఉండేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదన్నారు. ఇష్టారాజ్యంగా ఇళ్లు కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు బండ శంకర్, గాజంగి నందయ్య, తాటిపర్తి విజయలక్ష్మి, జయశ్రీ, ముంజాల రఘువీర్, పద్మ, పిప్పరి అనిత, కోండ్ర జగన్, ఎలిగేటి నర్సయ్య, చాంద్పాషా తదితరులు ఉన్నారు.
విశ్వబ్రాహ్మణులకు పథకాలు అందించాలి
● విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్
మల్లాపూర్ : నిరుపేద విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మలకు ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు అందించాలని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు చింతల రాజేశ్, మండల అధ్యక్షుడు మానాల నాగయ్య అన్నారు. మండలకేంద్రంలోని శ్రీవేంకటేశ్వర ఆలయ కల్యాణ మండపంలో సంఘం సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విశ్వబ్రాహ్మణ కుటుంబాల్లో 90శాతం మంది నిరుపేదలేనని, సీఎం స్పందించి ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రూ.వందకోట్లు కేటాయించాలని కోరారు. 4వ కేటగిరీ కింద కరెంట్ మీటర్లు ఇవ్వాలని, చిన్న పరిశ్రమలతో ప్రోత్సాహం అందించాలని కోరారు. లేబర్కార్డులు, వాటి ప్రయోజనాలను సంఘ సభ్యులకు వివరించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, మండల ప్రధాన కార్యదర్శి కూచనపెల్లి రజనీకాంత్, కోశాధికారి శేఖర్, సభ్యులు మద్దెనపల్లి శ్రీనివాస్, మురళి, సంకోజి రాజేందర్, దొంతి సుధాకర్, సుభాష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

సర్వేయర్ల పరీక్ష ప్రశాంతం

సర్వేయర్ల పరీక్ష ప్రశాంతం