
పాఠశాలల్లో గ్రంథాలయాలు
● అందుబాటులో బాలసాహిత్య పుస్తకాలు ● ప్రత్యేక పీరియడ్ నిర్వహణకు నిర్ణయం ● మొబైల్ ఫోబియాను తగ్గించడానికే..
జగిత్యాల: నేటి హైటెక్ యుగంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు అలవాటు పడుతున్నారు. పుస్తక పఠనం అనేది మరిచిపోతున్నారు. ఫలితంగా విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. అలాగే చదువులో నష్టపోతున్నారు. ఇలాంటి తరుణంలో విద్యార్థులను చదువుపై మళ్లించాలన్న ఉద్దేశంతో పాఠశాలల్లో గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నారు. వీటితో విజ్ఞానం పెరగడంతోపాటు సృజనాత్మకత పెంపొందుతుంది. ఇందులో సాహిత్యం, ఇతిహాసం, కార్టూన్లు, పురాణ కథలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని చదివితే సామాజిక స్పృహ అలవాటపడుతుంది. ఇందుకోసం ప్రత్యేక పీరియడ్ కూడా కేటాయించారు.
అధికారులు అప్రమత్తం
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు రావడంతో ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థుల్లో పుస్తక పఠన సామర్థ్యం పెంచడం, వారి జ్ఞానాన్ని పెంపొందించడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలలకు బుక్స్ పంపించడమే కాకుండా వీటి కోసం ఒక ప్రత్యేక పీరియడ్ నిర్వహించనున్నారు. పిల్లలే కాకుండా వారి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టీచర్స్ భవన్లో గ్రంథాలయాలపై ఉపాధ్యాయులకు శిక్షణ కల్పిస్తున్నారు. హైటెక్ యుగంలో ప్రపంచం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతీ విషయాన్ని నేర్చుకోవాలన్న ఉద్దేశంతో పుస్తక పఠనాన్ని విద్యార్థులకు అలవాటు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రైమరీ, యూపీఎస్ స్కూళ్లలో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నారు.
566 స్కూళ్లకు బుక్స్ అందజేత
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 566 స్కూళ్లకు ఇప్పటివరకు బుక్స్ను అందించారు. మొదటి విడతలో ఒక్కో స్కూల్కు 259 పుస్తకాల చొప్పున అందజేశారు. రెండో విడతలో 113 బుక్స్ అందించారు. ఇందులో ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ముద్రించినవి కూడా ఉన్నారు. చిన్నారులను ఆకట్టుకునేలా కథనాలు ఉన్నాయి. ప్రతీ కథ 11 పేజీల వరకు ఉంది. మంచిమంచి కథలున్నాయి. పాఠశాలలో విద్యాశాఖ గ్రంథాలయాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక చేస్తున్నారు. వీటిపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మార్గదర్శకాలను చేశారు.
సెల్ఫోన్ దృష్టి మళ్లించడానికే..
స్కూల్కు వెళ్లినప్పటికీ విద్యార్థులు ఇంటికి రాగానే ఈ మధ్యకాలంలో సెల్ఫోన్ల మోజులో పడిపోతున్నారు. అందులో ఎక్కువగా గేమ్స్, ఇతరత్రా యాప్లు చూస్తు ఉండిపోతున్నారు. కథనాల జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఫలితంగా వీరిలో పుస్తక పఠనం పూర్తిగా తగ్గిపోతోంది. ప్రస్తుతం స్కూళ్లలో ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేయడంతో చిన్నారులకు మంచి చదువుతో పాటు ప్రపంచ విషయాలు తెలుసుకునేలా ఉంటుంది. పాఠశాలల్లో మంచి బలోపేతమైన పుస్తకాలు ఏర్పాటు చేస్తే చదువు ఇంకా ముందుకెళ్తుంది. సెల్ఫోన్లు తగ్గించాలంటే నాణ్యమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం అయితే చిన్నారుల కోసం అనేక కథనాలతో కూడిన పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.
శిక్షణ కల్పిస్తున్నాం
పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ప్రతి పాఠశాలకు పుస్తకాలు పంపిణీ చేశాం. పిల్లల వద్దకే పుస్తకాలు తీసుకువచ్చే ప్రణాళిక చేశాం. పుస్తక పఠనం అలవాటు చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇది మంచి కార్యక్రమం.
– రాము, డీఈవో

పాఠశాలల్లో గ్రంథాలయాలు

పాఠశాలల్లో గ్రంథాలయాలు