
ప్రమాద బాధితులకు పరిహారం అందేలా చర్యలు
కోరుట్ల: కోరుట్లలో గతనెల 15న గణపతి విగ్రహం తరలిస్తుండగా జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితిపై ‘సాక్షి’ ‘పాపం దయనీయం’ శీర్షికన ఈనెల 24న కథనం ప్రచురించింది. ఈ కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10లక్షలు అందించామని, చికిత్స పొందుతున్న బాధితులకు వైద్యం వివరాలు సేకరిస్తున్నామని, ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. సంస్థ నిబంధనల ప్రకారం సివిల్ సర్జన్ ర్యాంక్ అధికారి ఇచ్చే డిజెబిలిటీ సర్టిఫికెట్ ఆధారంగా పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.
విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
జగిత్యాలఅగ్రికల్చర్: విద్యుత్ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో జగిత్యాల టౌన్, జగిత్యాల రూరల్, ధర్మపురి సబ్ డివిజన్ల విద్యుత్ సిబ్బందితో సమావేశమయ్యారు. విద్యుత్ ప్రమాదాలు జరగుకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని తెలిస్తే చర్యలు ఉంటాయన్నారు. భద్రత చర్యలు తీసుకోకుండా విధులు నిర్వర్తిస్తే రూ.3వేల జరిమానా విధిస్తామన్నారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. టెక్నికల్ సెఫ్టీ ఆఫీసర్ గంగారాం, జగిత్యాల డీఈ రాజిరెడ్డి, ఏడీఈలు, ఏఈలు, ఏఏఓలు, సబ్ ఇంజినీర్లు, ఓఅండ్ఎం ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
వైద్య కళాశాల ప్రిన్సిపల్గా షర్మిల
జగిత్యాల: మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా షర్మిల నియమితులయ్యారు. సూపరింటెండెంట్ ఎంజీ.మూర్తి, షర్మిల ఎమ్మెల్యే సంజయ్కుమార్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్ఎంవోలు విజయ్రెడ్డి, సుమన్మోహన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధీర్ ఉన్నారు.
ఆంక్షలు లేకుండా రైతులకు రుణాలివ్వండి
జగిత్యాలటౌన్: బ్యాంకుల ద్వారా రైతులకు ఆంక్షలు లేకుండా రుణాలు ఇచ్చేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్కు మాజీమంత్రి జీవన్రెడ్డి లేఖ రాశారు. పట్టాదారు పాస్ పుస్తకాలు తాకట్టు పెట్టుకోకుండా రుణాలివ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలను బ్యాంకులు పాటించడం లేదని, పాస్ బుక్కులు కలిగిన అసైన్డ్ భూముల రైతులకూ రుణాలు ఇచ్చేలా చూడాలని కోరారు.

ప్రమాద బాధితులకు పరిహారం అందేలా చర్యలు