
ఆరోగ్యం.. చల్లగా బేజారు!
● ప్రమాదకరంగా శీతలపానీయాలు ● నాణ్యతలేకుండా ఐస్ తయారీ ● వాటిని తాగితే గొంతునొప్పులు ● అనారోగ్య సమస్యల బారిన ప్రజలు
జగిత్యాల: జిల్లాలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. మార్చి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్లనుంచి బయటకు వస్తున్న జనాలు శీతల పానీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఇక్కడే పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న చెరుకురసాల బండ్లు, పండ్లరసాల బండ్ల నిర్వాహకులు వినియోగిస్తున్న ఐస్లో ఆరోగ్యానికి హాని చేసే కారకాలు వెలుగుచూస్తున్నాయి. వాస్తవానికి చల్లదనం కోసం శీతలపానీయాలు, చెరుకురసాల్లో ఐస్ ముక్కలు వేసి ఇస్తుంటారు. అవి పరిశుభ్రంగా లేకపోతే అనారోగ్యానికి గురికావాల్సిందే. పైగా ఐస్లో రకరకాల రంగులు కలుపుతున్నారు.
ఐస్లో రెండురకాలు
జిల్లాలో ఐస్ తయారుచేసే ఫ్యాక్టరీలు సుమారు 10 వరకు ఉన్నాయి. జిల్లా కేంద్రంతోపాటు, కోరుట్ల, మెట్పల్లిలోనూ ఐస్ ఫ్యాక్టరీలున్నాయి. ఈ ఫ్యాక్టరీలు ఐస్ తయారీకి వినియోగించే నీరు శుభ్రంగా ఉండడం లేదని సమాచారం. బోర్లు, ఇతరత్రా ప్రాంతాల నుంచి తెచ్చిన నీటిని వినియోగిస్తున్నట్లు సమాచారం. ఆ నీటిని ఐస్లా మార్చి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఈ ఐస్ ముక్కలనే పొద్దటి నుంచి సాయంత్రం వరకు వినియోగిస్తున్నారు. వాస్తవానికి శుభ్రమైన నీటితో ఐస్ తయారు చేస్తే తొందరగా నీటిలా మారుతుంది. అపరిశుభ్ర నీటిని వినియోగిస్తే ముద్దలా ఉండి.. రాత్రి వరకూ అలాగే ఉంటుందని సమాచారం. అలాగే ఫ్యాక్టరీల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐస్ ఫ్యాక్టరీల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన మున్సిపల్, ఫుడ్సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెండు విధాలుగా తయారీ
● ఫ్యాక్టరీల్లో ఐస్ను రెండు విధాలుగా తయారుచేస్తుంటారు.
● ఒకటి పారిశ్రామిక అవసరాలకు వినియోగించేది
● మరొకటి మాంసం, చేపలు, పండ్లు, ఔషధాల నిల్వలు, ఆస్పత్రులు కోసం వినియోగిస్తుంటారు.
● ఐస్ తయారుచేసే సమయంలో ఏ నీటితోనైనా తయారుచేస్తుంటారు.
● ముఖ్యంగా పండ్లరసాల్లో వినియోగించే ఐస్ను శుభ్రమైన నీటితో, పరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేయాలి.
● అలాంటి ఐస్ను ఎవరూ కొనుగోలు చేయడం లేదు. బయట ప్రాంతంలో.. తక్కువ ధరకు దొరికే ఐస్ను కొనుగోలు చేసి శీతల పానియాల్లో వాడుతున్నారు.
● నాణ్యతలేని ఐస్ ముక్కలను వాడటం వల్ల గొంతునొప్పి, జ్వరం, ఆస్తమా వంటివ్యాధులు వస్తాయి.
● శీతలపానీయాలు సేవించేవారు ఐస్ముక్కలు వేసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
● నాణ్యత లేని ఐస్ను గుర్తించడం కష్టమే అయినప్పటికీ.. ఐస్ వేసుకోకపోవడమే చాలా మంచిది.
నిబంధనలు హుష్కాకి
ఐస్ ఫ్యాక్టరీల్లో అపరిశుభ్రమైన నీటిని వాడటంతోపాటు నీటి పరీక్షలను చేయాలి.
కానీ.. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాల్సి ఉన్నా కనీసం పట్టించుకోవడం లేదు.
అపరిశుభ్రమైన నీటిని వాడటంతోపాటు ఐస్ తయారీకి ఉపయోగించే ఇనుపదిమ్మలు తుప్పుపట్టినా స్పందించేవారు లేరు.
ఐస్ గడ్డల్లో వినియోగించే ఉప్పును కూడా నాణ్యతలేనిది వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి.
వైరస్, బ్యాక్టీరియలతో మలబద్దకం, టైపాయిడ్, డయేరియా తదితర వ్యాధులకు కారకాలవుతున్నాయి.
కొందరు రుచి ఉండాలన్న ఉద్దేశంతో రసాయనాలు వాడుతుంటారు. ఇవి మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తున్నట్లు సమాచారం.
కండ్లు, దంతాలు కూడా దెబ్బతింటాయని వైద్యులు పేర్కొంటున్నారు.

ఆరోగ్యం.. చల్లగా బేజారు!