
43 శాతానికి తగ్గిన జనామోదం
రక్షణ, విదేశీ విధానంపైనా పెదవి విరుపు
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై ఎడాపెడా టారిఫ్లు వడ్డించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రాఫ్ బాగా పడిపోయింది. ఆయనను అధ్యక్షుడిగా అంగీకరించే అమెరికన్ల సంఖ్య 43 శాతానికి పడిపోయింది. బుధవారంతో ముగిసిన మూడు రోజుల సర్వేలో ఈ మేరకు వెల్లడైంది. మూడు నెలల కింద అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయనకు మద్దతు ఇంత తగ్గడం ఇదే తొలిసారి.
జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు ట్రంప్కు 47 శాతం మద్దతు లభించింది. ట్రంప్ సుంకాలు, నిర్వహణపై అమెరికన్లు బాగా అసంతృప్తితో ఉన్నారు. ఆయన విదేశాంగ విధానాన్ని సైతం వ్యతిరేకిస్తున్నారు. వలసదారులను తిప్పి పంపుతున్న అంశంపై మాత్రమే ట్రంప్ విధానాలకు ఆమోదం తెలిపారు. ట్రంప్ పాపులారిటీ తగ్గడానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్న తీరే.
ఈ విషయంలో ఆయన పనితీరును కేవలం 37 శాతం మంది మాత్రమే ఆమోదించారు. ఆటోమొబైల్స్, ఆటోమోటివ్ విడిభాగాల వంటి వస్తువులపై ట్రంప్ విధించిన భారీ సుంకాలతో చాలామంది అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. కొత్త టారిఫ్లు తమకు, తమ కుటుంబాలకు చేటు చేస్తాయని భావిస్తున్నట్లు సర్వేలో దాదాపు సగం మంది పేర్కొన్నారు. ట్రంప్ సుంకాల పెంపు స్టాక్ మార్కెట్లో కూడా అనిశ్చితికి దారితీయడం తెలిసిందే.
ఆయన దుందుడుకు విధానాలు దీర్ఘకాలిక దౌత్య నిబంధనలకు విఘాతం కలిగించడమే గాక ప్రపంచంతో అమెరికా వ్యవహరించే విధానంలో మార్పుకు కారణమయ్యాయి. ట్రంప్ సైనిక నిర్వహణ పట్ల కూడా అమెరికన్లు బాగా ఆందోళన చెందుతున్నట్టు సర్వే తేల్చింది. యెమెన్లో హౌతీ ఉగ్రవాదులపై సైనిక దాడి ప్రణాళిక సిగ్నల్ యాప్ ద్వారా లీకవడంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. ఇది తవ్ర బాధ్యతారాహిత్యమని ఏకంగా 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ట్రంప్ విదేశాంగ విధానానికి జనామోదం కూడా జనవరిలో 34 శాతానికి పడిపోయింది. జనవరిలో ఇది 37 శాతంగా ఉంది. ట్రంప్ వలస విధానాలకు 48 శాతం ఆమోదం లభించింది.