కరోనాతో రాజకీయ సంక్షోభం: ప్రధానమంత్రి తొలగింపు | Tunisia President Suspends Parliament | Sakshi
Sakshi News home page

ప్రధానమంత్రిని తొలగించి.. పార్లమెంట్‌ రద్దు

Jul 26 2021 5:22 PM | Updated on Jul 26 2021 5:29 PM

Tunisia President Suspends Parliament - Sakshi

ట్యూనిషియా దేశ అధ్యక్షుడు కైస్‌ సయీద్‌

టూనిస్‌ (ట్యూనిషియా): మహమ్మారి కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికించింది. ప్రజలతో పాటు ప్రభుత్వాలను కుప్పకూలుస్తోంది. తాజాగా ట్యూనిషియా దేశంలో కరోనా ప్రభావంతో ఏకంగా ప్రధానమంత్రినే తొలగించారు. దేశ అధ్యక్షుడు మొత్తం పార్లమెంట్‌ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై తాజా మాజీ ప్రధానమంత్రి అధ్యక్షుడి నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభుత్వానికి కావాల్సిన పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ పార్లమెంట్‌ను రద్దు చేయడంపై మండిపడుతున్నారు. దీంతో ప్రస్తుతం టునిషీయాలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.

ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ట్యూనిషియాలో కరోనా తీవ్రంగా ప్రబలింది. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శించాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలోనే కొన్ని నెలల కిందట ఆరోగ్య శాఖ మంత్రిని పదవి నుంచి తొలగించారు. ప్రస్తుతం ఆ దేశంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రాజధాని నగరం టునీస్‌లో ప్రజలు, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అధికార పార్టీ ఎన్నాహద్‌ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. కంప్యూటర్లు పగులగొట్టి.. నిప్పు పెట్టి హింసాత్మక పరిస్థితులకు దారి తీసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతుండడంతో దేశ అధ్యక్షుడు కైస్‌ సయీద్‌ ప్రధానమంత్రి హిచెమ్‌ మెచిచిని పదవిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్‌ను రద్దు చేశారు. 

అధికార పార్టీ ‘ఇస్లామిస్ట్‌ ఇన్‌స్పైర్‌డ్‌ ఎన్నాహ్‌ద పార్టీ’కి వ్యతిరేకంగా దేశంలోని అన్ని ప్రదాన నగరాల్లో ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు తెలిపారు. అయితే అధ్యక్షుడి నిర్ణయాన్ని  తాజాగా మాజీ ప్రధానమంత్రిగా అయిన హిచెమ్‌ మెచిచి తప్పుబట్టారు. రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2019లో అధ్యక్షుడిగా కాయిస్‌ సయీద్‌ ఎన్నికయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement