ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్.. (ఇన్సెట్లో ట్రంప్)
పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు తెర పడింది. అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో కీలక అడుగు పడింది. డీల్కు సంబంధించిన అవగాహన ఒప్పందంపై అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకాలు చేశారు. దీంతో యుద్ధం అధికారికంగా ముగిసినట్లైంది. అయితే ఈ ఎంవోయూపై ఇప్పుడు ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది.
జీ7 సదస్సు అనంతరం పారిస్లోని వెర్సైల్స్ ప్యాలెస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విందు ఇచ్చారు. దీనికి హాజరైన ట్రంప్ ఒప్పంద పత్రంపై(MoU) సంతకం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇటు ఇరాన్ కూడా డీల్ను కన్ఫర్మ్ చేసింది. తమ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంతకం చేసినట్లు వెల్లడించింది. అయితే ఒప్పందం కుదరడం కంటే.. దాన్ని అమలు చేయడమే ఇప్పుడు అసలు పరీక్ష అని టెహ్రాన్ అంటోంది.

ఇక ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయెల్ బఘాయ్ Esmaeil Baqaei మాట్లాడుతూ.. "ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం (Memorandum of Understanding)పై ఇరు దేశాధినేతల సంతకాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఒప్పందం అమలును పరీక్షించే సమయం వచ్చింది. ఇది ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి" అంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది.
"అమెరికా సంయుక్త రాష్ట్రాలు – ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం" పేరుతో రూపొందించిన ఈ పత్రంలో పలు కీలక అంశాలు ఉన్నాయి. లెబనాన్ సహా అన్ని రంగాల్లో సైనిక చర్యలను వెంటనే, శాశ్వతంగా నిలిపివేయాలని ఇందులో పేర్కొన్నారు.
ఒప్పందం ప్రకారం అమెరికా 30 రోజుల్లో ఇరాన్పై అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. అదే సమయంలో యుద్ధానికి ముందు ఉన్న స్థాయిలో వాణిజ్య నౌకల రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలి. తుది ఒప్పందం కుదిరిన తర్వాత 30 రోజుల్లో ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాలు వైదొలగాలని కూడా ఇందులో పేర్కొన్నారు.
మరోవైపు, వాణిజ్య నౌకలకు 60 రోజుల పాటు ఎలాంటి రుసుము లేకుండా సురక్షిత ప్రయాణం కల్పించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
సంతకాలు పూర్తవడంతో ఇకపై 60 రోజులపాటు అమెరికా–ఇరాన్ ప్రతినిధులు తుది ఒప్పందానికి సంబంధించిన నిబంధనలపై చర్చలు జరపనున్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే పశ్చిమాసియాలో దీర్ఘకాలిక స్థిరత్వానికి మార్గం సుగమం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా–ఇరాన్ ఎంవోయూలో కీలక అంశాలు
- లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో అమల్లోకి కాల్పుల విరమణ
- 60 రోజుల్లో తుది ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు
- పరస్పర అంగీకారంతో గడువు పొడిగింపునకు అవకాశం
- 30 రోజుల్లో ఇరాన్పై అమెరికా నౌకాదళ దిగ్బంధనానికి ముగింపు
- యుద్ధానికి ముందు స్థాయిలో నౌకల రాకపోకల పునరుద్ధరణ
- తుది ఒప్పందం తర్వాత 30 రోజుల్లో ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ
- 60 రోజుల పాటు వాణిజ్య నౌకలకు ఉచిత, సురక్షిత రాకపోకలకు ఇరాన్ హామీ
- హర్ముజ్ జలసంధిలో నౌకాయానానికి ఎలాంటి రుసుములు లేకుండా ఏర్పాట్లు
- అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని ఇరాన్ అంగీకారం
- ఐఏఈఏ పర్యవేక్షణలో యురేనియం(శుద్ధి చేసిన) నిర్వహణకు ఒప్పుకోలు
- ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధికి కనీసం 300 బిలియన్ డాలర్ల నిధి ఏర్పాటు
- ఆ నిధిలో అమెరికాతో పాటు ప్రాంతీయ భాగస్వామ్య దేశాల భాగస్వామ్యం
- ఇరాన్పై ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయడానికి అమెరికా అంగీకారం
- ఆంక్షల ఎత్తివేతకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ తుది ఒప్పందంలో ఖరారు
అయితే.. అధికారిక సంతకాల కార్యక్రమం మొదట స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరగాల్సి ఉన్నప్పటికీ, ఒప్పందంపై ఇప్పటికే డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయని స్పష్టమవుతోంది. అయినప్పటికీ.. ఫిజికల్ సంతకాల కోసం జెనీవా సమావేశం యథావిధిగా కొనసాగవచ్చని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం జరగబోయే ఈ భేటీలో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొంటుండగా.. ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్ హాజరు కావొచ్చని తెలుస్తోంది.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై దాడులు ప్రారంభించిన తర్వాత సుమారు 110 రోజుల పాటు కొనసాగిన ఘర్షణలకు ఈ ఒప్పందం ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టెహ్రాన్ చెప్పినట్లే, ఒప్పందం కుదరడం ఒక దశ అయితే, దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడమే అసలు సవాలుగా మారింది.
ఇదీ చదవండి: ట్రంప్ సంతకం.. డీల్లో మ్యాటర్ ఏంటంటే..


