పెట్టుబడులతో ముందుకు రావాలి | PM Modi meets leading CEOs in France | Sakshi
Sakshi News home page

పెట్టుబడులతో ముందుకు రావాలి

Jun 19 2026 5:45 AM | Updated on Jun 19 2026 5:45 AM

PM Modi meets leading CEOs in France

భారత్‌లో వ్యాపార అభివృద్ధికి, విస్తరణకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి  

ఫ్రాన్స్‌ కంపెనీల సీఈఓలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు  

పారిస్‌:  భారత్‌లో వ్యాపార అభివృద్ధికి, విస్తరణకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని ఫ్రాన్స్‌ పారిశ్రామికవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన గురువారం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో పలు అగ్రశ్రేణి కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో(సీఈఓలు) సమావేశమయ్యారు. పెట్టుబడి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. నౌకాయానం, సరుకు రవాణా, రైల్వేలు, నిర్మాణం, కృత్రిమ మేధ(ఏఐ) సహా పలు కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై సంప్రదింపులు జరిపారు.

భారతదేశంలో ఉన్న అవకాశాలపై చర్చలు జరిపామని సీఎంఏ సంస్థ సీఓఓ రొడాల్ప్‌ సాదే పేర్కొన్నారు. ఓడల నిర్మాణం, ఓడల రీసైక్లింగ్, లోతైన సముద్ర ఓడరేవులు, అలాగే కంటైనర్ల నిర్మాణం గురించి కూడా మోదీతో చర్చించామని తెలిపారు. ఫ్రాన్స్, భారత్‌లు పరస్పర సహకారాన్ని కొనసాగించడంలోనూ, కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడంలోనూ గొప్ప అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు చెప్పారు. సెయింట్‌ గోబైన్‌ సంస్థ సీఈఓ బెనాయిట్‌ బెజిన్, అల్‌స్టామ్‌ సీఈఓ మార్టిన్‌ సియోన్, మిస్ట్రాల్‌ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆర్థర్‌ మెన్స్‌ను సైతం మోదీ కలుసుకున్నారు.  

అందరికీ అందుబాటులో టెక్నాలజీ  
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. భారతదేశం దృష్టిలో ఏఐ అంటే ‘అందరినీ కలుపుకొని పోయేది’అని తెలిపారు. అమెరికా ఇటీవల కొన్ని కృత్రిమ మేధ(ఏఐ) నమూనాల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలని మోదీ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం పారిస్‌లో వివాటెక్‌–2026 టెక్నాలజీ సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్‌ లావాదేవీల్లో సగం తమ దేశంలోనే జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఆర్థిక సమ్మిళితం, విద్య, టెలిమెడిసిన్, వ్యవసాయం, ఇతర రంగాల్లో సాంకేతికతను భారీ స్థాయిలో వినియోగిస్తున్నామని తెలిపారు.

సాంకేతికత, నూతన ఆవిష్కరణలు అందరికీ అందుబాటు ఉండడం చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. సాంకేతికత ప్రజాస్వామీకరణతోనే పురోగతి సాధ్యపడుతుందని వివరించారు. ఈ విప్లవాత్మక మార్పుల యుగంలో టెక్నాలజీ అందరికీ ప్రయోజనం చేకూర్చాలని భారత్‌ విశ్వసిస్తోందని అన్నారు. ఏఐ అనేది ప్రజల జీవితాలను మెరుగుపరచాలని వ్యాఖ్యానించారు. ‘‘మా విధానం స్పష్టంగా ఉంది. మా ప్రభుత్వం సహకరిస్తుంది. పరిశ్రమలు ఆవిష్కరణలు చేస్తాయి. స్టార్టప్‌లు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయి. ప్రపంచ భాగస్వాములు మాతో కలిసి అభివృద్ధి చెందుతారు. మనమందరం కలిసి మునుపెన్నడూ లేనంత వేగంగా ముందుకు సాగుదాం’’అని పారిశ్రామికవేత్తలకు సూచించారు. తమతో కలిసి పని చేయాలని, అందరికీ ఫలితాలను అందించాలని కోరారు.  

పారిస్‌లో మోదీకి ఘన స్వాగతం  
ఫ్రాన్స్‌లోని ఎవియన్‌–లెస్‌–బెయిన్స్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాజధాని పారిస్‌కు చేరుకున్నారు. పారిస్‌లోని ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ పురోగతికి భారత్‌–ఫ్రాన్స్‌ భాగస్వామ్యం అత్యంత కీలకమని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. భారతదేశాన్ని, ఫ్రాన్స్‌ను మరింత సన్నిహితంగా మార్చడానికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని చూసి తాను గర్వపడుతున్నానని స్పష్టంచేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement