ఇరాన్ యుద్ధం ప్రపంచ సంక్షోభంగా మారకముందే ఈ ఘర్షణను ముగించేందుకు అమెరికాతో నాటో కలవాలని పలువురు నిపుణులు అంటున్నారు. ఇరాన్ యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే సూచనలు కనపడుతుండడంతో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జర్నలిస్టు మారియో నాఫల్తో ఓ ఇంటర్వ్యూలో తాజాగా హంగేరీ ప్రధాన మంత్రి విక్టర్ ఆర్బాన్ మాట్లాడారు. ఆ దేశ ప్రధానిగా విక్టర్ 2010 నుంచి కొనసాగుతున్నారు. యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు అమెరికాకు నాటో మద్దతు ఇవ్వాలని ఆయన చెప్పారు. ఆలస్యం జరిగితే పెను సంక్షోభంగా మారి యూరప్తో పాటు ప్రపంచంపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. హంగేరీ కూడా యూరప్ దేశమే.
ఇరాన్ యుద్ధం విషయంలో, అలాగే గ్రీన్లాండ్పై ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో నాటోలో విభేదాలు కొనసాగుతున్న సమయంలో విక్టర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. “ఈ యుద్ధం త్వరగా ముగిస్తే విజయం, లేదంటే విపత్తు” అని విక్టర్ చెప్పారు.
కాగా, యుద్ధం ప్రారంభమైనప్పుడు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే.. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలను బహిరంగంగా ప్రశంసించారు. ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను తగ్గించడంలో ఇది ముఖ్యమని చెప్పారు. సభ్య దేశాలు అమెరికా చర్యలకు సహకరించవచ్చని సూచించారు.
అయితే, జర్మనీ చాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్.. ఈ యుద్ధం యూరప్ యుద్ధం కాదని చెప్పారు. నాటో నేరుగా పాల్గొనడాన్ని తిరస్కరించారు.
విక్టర్ ఆర్బాన్ అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ హింసాత్మక, యూదు వ్యతిరేక, స్వేచ్ఛా వ్యతిరేక నెట్వర్క్ కేంద్రంగా ఉంది. దాని మిలిటరీ సామర్థ్యాన్ని ధ్వంసం చేస్తే శాంతికి దోహదం చేసినట్లు అవుతుందని అన్నారు.
9 కోట్ల జనాభా అస్థిరమైతే..
అయితే ఇది త్వరగా సాధ్యం కాకపోతే మరింత పెద్ద, సంక్లిష్ట, దీర్ఘకాలిక యుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. యుద్ధం ఇంధన ధరలను పెంచుతుందని, ఇరాన్ నుంచి యూరప్నకు వలసలను పెంచుతుందని చెప్పారు. 90 మిలియన్ల (9 కోట్ల) జనాభా ఉన్న ఇరాన్ అస్థిరమైతే.. టర్కీ, బాల్కన్ మార్గాల ద్వారా వలసలు హంగేరీ సరిహద్దులకు చేరుతాయని చెప్పారు. 2015లో జరిగిన యూరోపియన్ శరణార్థి సంక్షోభం సమయంలో 1.3 మిలియన్ మంది శరణార్థులు వచ్చిన పరిస్థితి ఇప్పటికే అనేక దేశాలను తీవ్రమైన సమస్యల్లోకి నెట్టిందని అన్నారు.
సహజ వనరులు లేని హంగేరీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇంధన దిగుమతుల ఖర్చులు పెరగడంతో 10 బిలియన్ యూరోల ఆర్థిక నష్టం చవిచూసింది. హార్మూజ్ జలసంధి ఇష్యూ వల్ల మళ్లీ చమురు ధరలు పెరిగితే మరో దెబ్బ తగులుతుందని చెప్పారు. అమెరికాకు మద్దతు ఇవ్వాలని ఆర్బాన్ సూచించారు. అమెరికా చాలా ఏళ్లుగా యూరప్ భద్రతకు మద్దతు ఇచ్చిందని, అందుకే ఇప్పుడు యూఎస్కు సహకారం అందించడం అవసరమని చెప్పారు.


