ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం | Modi conferred Seychelles highest honour for environmental leadership | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం

Jun 28 2026 3:22 PM | Updated on Jun 28 2026 4:20 PM

Modi conferred Seychelles highest honour for environmental leadership

విక్టోరియా: సముద్ర పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ అనుకూల వృద్ధి (గ్రీన్ గ్రోత్), సముద్ర వనరుల బాధ్యతాయుత నిర్వహణలో ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ సెషెల్స్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హరైజన్’ అవార్డును ప్రధానికి ప్రదానం చేసింది.

ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రెసిడెన్షియల్ సైటేషన్‌లో ప్రధాని మోదీ సుస్థిర ఆర్థిక వృద్ధి, బ్లూ ఎకానమీ (సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ) పట్ల చూపిన నిబద్ధతను సెషెల్స్ ప్రభుత్వం కొనియాడింది. ముఖ్యంగా చిన్న ద్వీప దేశాలకు భారత్ అందిస్తున్న మద్దతును, వాతావరణ ప్రతిఘటన శక్తిని పెంపొందించడంలో, అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించడంలో మోదీ పోషించిన పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించింది.

ఈ పురస్కారం భారత్-సెషెల్స్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని సెషెల్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తనకు లభించిన ఈ ప్రతిష్టాత్మక గౌరవంపై ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. సెషెల్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడంపై గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటూ, పర్యావరణ పరిరక్షణను తమ భవిష్యత్ తరాల పట్ల బాధ్యతగా భావిస్తున్న ప్రపంచంలోని అన్ని దేశాలకు దీనిని అంకితం చేస్తున్నాను’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

పర్యావరణం, వ్యవసాయ రంగాలలో ప్రధాని మోదీ అంతర్జాతీయంగా అందుకున్న అవార్డుల పరంపరలో ఇది తాజా చేరింది. కాగా, ఈ ఏడాది మేలో ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రధానికి ‘అగ్రికోలా మెడల్’ అందజేసింది. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, ఆధునిక వ్యవసాయ మార్పులు తీసుకురావడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం లభించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement