కెన్యాలో తీవ్ర విషాదం.. హెలికాఫ్టర్‌ కూలి ఏడుగురి మృతి | Kenya Helicopter Crash: 5 Americans Among 7 Killed | Sakshi
Sakshi News home page

కెన్యాలో తీవ్ర విషాదం.. హెలికాఫ్టర్‌ కూలి ఏడుగురి మృతి

Aug 20 2026 7:00 AM | Updated on Aug 20 2026 7:15 AM

Kenya Helicopter Crash: 5 Americans Among 7 Killed

కెన్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సఫారీ ప్రయాణంలో ఉన్న హెలికాప్టర్‌ కుప్పకూలడంతో ఏడుగురు మరణించారు. మృతుల్లో ఈక్వెడార్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ దంపతులతో పాటు ఐదుగురు అమెరికన్లు కోల్పోయారు. ఉత్తర కెన్యాలోని మారుమూల ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

కెన్యా పౌర విమానయాన సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. లోయిసాబా కన్జర్వెన్సీ నుంచి ఎవాసో న్యిరో ప్రాంతానికి వెళ్తుండగా ఉదయం 9.13 గంటలకు సాంబురు కౌంటీలోని పర్వత ప్రాంతంలో హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ఘటన సమయంలో హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు, ఒక పైలట్‌ ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే హెలికాప్టర్‌లో ఉన్నఅంతా మృతి చెందినట్లు సాంబురు పోలీసు కమాండర్‌ డేవిడ్‌ న్కోరోయ్‌ వెల్లడించారు.

మృతుల్లో ఐదుగురు అమెరికా పౌరులు ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈక్వెడార్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ పేరు మిచెల్‌ సెన్సీ-కాంటూగి.. ఆయన సతీమణి స్టెఫనీ హోలిహాన్‌ కూడా మృతి చెందారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన అమెరికా రాయబార కార్యాలయం.. స్థానిక అధికారులతో కలిసి కాన్సులర్‌ సహాయం అందిస్తున్నట్లు పేర్కొంది. 

మృతుల వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ఫ్లోరిడాకు చెందిన టెలిముండో మీడియా సంస్థ ఉన్నతాధికారి జోసే సువారెజ్‌ (55) మృతుల్లో ఒకరని స్థానిక మీడియా తెలిపింది. ఆయన టెలిముండో ఫ్లోరిడా స్టేషన్లకు అధ్యక్షుడు, జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రమాదానికి ముందు వాళ్లంతా సరదాగా గడిపిన చిత్రాలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ లేడీ లోరీ హెలికాఫ్టర్స్‌కు చెందినదిగా అధికారులు తెలిపారు. ఇది చార్టర్‌ ఫ్లైట్‌గా నడుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. మౌంట్‌ ఒలోలోక్వే పర్వత పాద ప్రాంతంలోని క్లిష్టమైన భూభాగంలో హెలికాప్టర్‌ కూలిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాద స్థలానికి చేరుకునేందుకు కెన్యా రెడ్‌క్రాస్‌, ఇతర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

కెన్యాలో పర్యాటక రంగం విస్తృతంగా ఉండటంతో దూర ప్రాంతాలకు ప్రయాణికులను తరలించేందుకు హెలికాప్టర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో దేశంలో హెలికాప్టర్‌ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ కెన్యాలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఓ ఎంపీ సహా ఆరుగురు మృతి చెందారు. తాజా ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement