Missing Titanic Submarine With 5 Onboard Has 40 Hours Of Oxygen Left, Details Inside - Sakshi
Sakshi News home page

టైటాన్‌ మిస్సింగ్‌కి రెండురోజులు.. ఆక్సిజన్‌ అయిపోతోంది.. కొన్ని గంటలే! వాళ్ల జాడేది?

Published Wed, Jun 21 2023 11:03 AM

Just Few Hours Of Air Left On Atlantic Missing Titanic Sub - Sakshi

దాదాపు రెండు రోజులు గడిచాయి. సమయం గడిచే కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. ప్రాణవాయివు కొద్దిగంటలకే సరిపడా ఉండడంతో.. అదృశ్యమైన మినీ జలంతర్గామిలోని వాళ్ల పరిస్థితి ఏంటన్న ఆందోళన నెలకొంది. దీంతో అట్లాంటిక్‌ లోతుల్లో వెతుకులాటను వేగవంతం చేశారు. కానీ, రెండు మైళ్ల కంటే ఎక్కువ లోతులో.. 20వేల చదరపుకిలోమీర్ల విస్తీర్ణం ఉన్న ఆ ప్రాంతంలో అదంతా సులువు అయ్యే పనేనా?. 

చిమ్మచీకట్లు.. గడ్డకట్టుకుపోయే చలి.. పైగా సముద్రపు బురద.. ఆ అగాథంలో ఎదురుగా ఏమున్నదనేది ఎంత వెలుగుతో వెళ్లినా కనిపించని స్థితి.. మొత్తంగా అంతరిక్షంలోకి వెళ్లినట్లే ఉంటుందట అక్కడి పరిస్థితి. 

అట్లాంటిక్‌ మహా సముద్రంలో 111 ఏళ్ల కిందట మునిగిన టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ మినీ జలాంతర్గామి ఆచూకీ గల్లంతైంది. ఇందులో ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఉంది. ఆ మినీ సబ్‌మెరైన్‌లో కొద్దిగంటలపాటు సరిపడా ఆక్సిజన్‌ మాత్రమే మిగిలి ఉంది. దీంతో గంట గడిచే కొద్దీ ఆందోళన పెరుగుతోంది. జలాంతర్గామిని కనుగొనేందుకు అమెరికా, కెనడా రక్షణ బృందాలు రంగంలోకి దిగినా.. కష్టతరంగా మారింది రెస్క్యూ ఆపరేషన్‌. 

బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త, సాహసయాత్రికుడు హమీష్‌ హార్డింగ్‌, పాకిస్థాన్‌ బిలియనీర్‌ షాజాదా దావూద్‌.. ఆయన కొడుకు సులేమాన్‌, మరో ఇద్దరు ఉన్నారు. 

ఏం జరిగింది.. 
ఓషన్‌గేట్‌ అనే సంస్థ చేపట్టిన ఎనిమిది రోజుల సాహస యాత్రలో టైటానిక్‌ శకలాల సందర్శన ఓ భాగం. ఇందుకోసం 22 అడుగుల పొడవైన మినీ జలాంతర్గామిని వాడారు.  దాని పేరు టైటాన్‌. ఒక్కో టికెట్‌ ధర 2 లక్షల యాభై వేల డాలర్లు. ఐదుగురు సభ్యులతో కూడిన టైటాన్‌.. న్యూఫౌండ్‌లాండ్‌ నుంచి మొదలైంది. 400 నాటికల్‌ మైళ్ల దూరంలోని టైటానిక్‌ శకలాల వద్దకు వెళ్లి రావాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో న్యూ ఫౌండ్‌ల్యాండ్‌లోని సెయింట్‌ జాన్స్‌కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో టైటాన్‌.. మహా సాగరంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయింది.

రెండు గంటల్లోపే..
టైటాన్‌ భాగం.. కార్బన్‌ ఫైబర్‌తో రూపొందింది. సాధారణ జలాంతర్గాములు సొంతంగా రేవు నుంచి బయల్దేరి వెళ్లి, తిరిగి అక్కడికి చేరుకోగలవు. సబ్‌మెర్సిబుల్‌గా పేర్కొనే ఈ మినీ జలాంతర్గామిని మాత్రం సాగరంలోకి పంపడానికి, వెలికి తీయడానికి ఒక నౌక అవసరం. ఇందుకోసం కెనడాకు చెందిన పోలార్‌ ప్రిన్స్‌ అనే షిప్‌ సేవలను ఓషన్‌గేట్‌ సంస్థ ఉపయోగించుకుంది. అయితే.. గంటా 45 నిమిషాల్లోనే ఆ జలాంతర్గామితో పోలార్‌ ప్రిన్స్‌కు సంబంధాలు తెగిపోయాయి. 

టైటానిక్‌ చూసేందుకు..
1912లో మంచుకొండను ఢీకొట్టి టైటానిక్‌ నౌక అట్లాంటిక్‌ మహా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 2,200 మంది ప్రయాణికులు, 700 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్‌ శకలాలను తొలిసారి 1985లో గుర్తించారు. వాటిని చూసేందుకు 2021లో కొందరు పర్యాటకులు లక్ష నుంచి లక్షన్నర డాలర్లు చెల్లించి సముద్రగర్భంలోకి వెళ్లారు. ఇప్పటి యాత్రలో మాత్రం ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షల డాలర్ల వరకూ ఓషన్‌గేట్‌ సంస్థ వసూలు చేసినట్లు తెలుస్తోంది. టైటాన్‌ ఇదివరకూ ఇలాంటి యాత్రలు చేపట్టినా.. ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని కంపెనీ చెబుతోంది.

టైటాన్‌ సబ్‌మెరీన్‌ కోసం వెతికే ప్రయత్నంలో సెర్చ్‌ టీంకు లోపల ఏదో పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయట. మంగళవారం ప్రతీ అరగంటకొకసారి.. కొన్ని గంటల తర్వాత మళ్లీ ఆ సౌండ్లు వినిపించాయట. యూఎస్‌ కోస్ట్‌గార్డ్‌ దీనిని ధృవీకరించింది కూడా. ఇంకోవైపు ఓషన్‌గేట్‌ సంస్థ నిర్వాహణ తీరుపై తీవ్ర విమర్శలతో పాటు సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ కూడా వస్తున్నాయి. 

Advertisement
 
Advertisement