ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం | Israel Army says Iran Missiles Incoming | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం

Jun 16 2025 7:11 AM | Updated on Jun 17 2025 6:45 AM

Israel Army says Iran Missiles Incoming

ఇరాన్‌ దాడుల్లో ఎనిమిది మంది మృతి  

అమెరికన్‌ కాన్సులేట్‌ స్వల్పంగా ధ్వంసం 

టెహ్రాన్‌లో ఖుద్స్‌ ఫోర్స్‌ కమాండ్‌ సెంటర్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడి

టెల్‌ అవీవ్‌/వాషింగ్టన్‌:  ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధం నాలుగో రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతీకారంతో రగిలిపోతోంది. తమ అణు స్థావరాలను ధ్వంసం చేయడంతో అత్యున్నత సైనికాధికారులను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం నేర్పాలన్న లక్ష్యంతో సోమవారం ఉదయం క్షిపణుల వర్షం కురిపించింది. టెల్‌ అవీవ్, పెటా తిక్వా ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఈ దాడుల్లో కనీసం ఎనిమిది మంది ఇజ్రాయెల్‌ పౌరులు మృతిచెందారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. సాధారణ పౌరులను ఇరాన్‌ సైన్యం లక్ష్యంగా చేసుకుందని ఇజ్రాయెల్‌ పోలీసు శాఖ అధికార ప్రతినిధి డీన్‌ ఎల్స్‌డన్‌ ఆరోపించారు. 
 

ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ను తాకింది. దీంతో కాన్సులేట్‌ స్వల్పంగా దెబ్బతిన్నట్లు అమెరికా రాయబారి మైక్‌ హకాబీ చెప్పారు. తమ సిబ్బంది ఎవరూ గాయపడలేదని ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ముందుజాగ్రత్తగా చర్య టెల్‌ అవీవ్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌తోపాటు జెరూసలేంలోని అమెరికా ఎంబసీని సోమవారం మూసివేశారు. ఇజ్రాయెల్‌పై దాదాపు 100 మిస్సైళ్లుప్రయోగించినట్లు ఇరాన్‌ ప్రకటించింది. 

మరిన్ని ప్రతీకార దాడులు ఉంటాయని తేల్చిచెప్పింది. ఇరాన్‌ దాడుల్లో తమ దేశంలో ఇప్పటిదాకా 24 మంది మరణించారని, 500 మందికిపైగా గాయపడ్డారని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ఇరాన్‌ సైన్యం 370 మిస్సైళ్లు, వందలాది డ్రోన్లు ప్రయోగించినట్లు పేర్కొంది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఖుద్స్‌ ఫోర్స్‌కు చెందిన 10 కమాండ్‌ సెంటర్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలియజేసింది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో ఇరాన్‌లో ఇప్పటివరకు 224 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,277 మంది గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్యను ఇరాన్‌ ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని మానవ హక్కుల సంఘాలు అంటున్నాయి. వాస్తవానికి ఇరాన్‌లో 400 మందికిపైగా మరణించారని చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Air India Plane Crashed: వీరంతా మృత్యువును తప్పించుకున్నారిలా..

Advertisement
 
Advertisement
Advertisement